Manish Sisodia : మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ తనపై పెట్టిన కేసులలో బెయిలు కోసం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పెట్టిన దరఖాస్తులను స్వీకరించడానికి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నిరాకరించింది.
సిసోడియా అక్రమ ధన చలామణికి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ, ఈడీలు కేసులు పెట్టాయి. ఈ కేసుల్లో ఈడీ తుది ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేశాక, సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన తరవాత సిసోడియా బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు వెసులుబాటు కల్పించింది. ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఛార్జిషీటుకు సమానం. వీటిని జూలై 3వ తేదీ కల్లా ఈడీ, సీబీఐలు దాఖలు చేస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు. సిసోడియా 15 నెలల నుంచి కస్టడీలో ఉన్నా ఈడీ, సీబీఐల దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదని, అందుకే ఆయనపై ఉన్న కేసుల్లో విచారణ ఇంకా మొదలు కాలేదని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. అందువల్ల సిసోడియాకు బెయిలు ఇవ్వాలని కోరారు.