DK Shivakumar : ఏపీ రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని.. ఇందుకు కోసమే బెంగుళూరు వెళ్లారని ప్రచారం అయింది. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరులో ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో చర్చలు జరుపుతున్నారని వార్త వైరల్ అవుతోంది. మరోవైపు బీజేపీ నేత, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి కూడా.. జగన్ వైసీపీని త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఆరోపించారు.
కాంగ్రెస్లో వైసీపీని విలీనం చేసేందుకు వైఎస్ జగన్ రెడీ అవుతున్నారని .. అయితే ఆయన సోదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితేనే తన పార్టీని విలీనం చేస్తానని జగన్ డిమాండ్ చేసినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. ఐదు రోజుల పర్యటన అనంతరం సొంత నియోజక వర్గం పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లిన జగన్.. అక్కడ డీకే శివకుమార్తో చర్చలు జరుపుతున్నట్లు ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్లో వైసీపీ విలీనం జరగబోతుందనే ప్రచారం మరింతగా పెరిగింది. ఇందులో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరొందిన డీకే శివకుమార్ పేరు ప్రస్తావనకు రావడం, ఆయనకు వైఎస్ఆర్ కుటుంబానికి మధ్య మంచి సంబంధాలే ఉండటంతో.. ఈ ప్రచారానికి మరింతగా బలం చేకూరినట్టు అయింది. గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన కుమార్తె షర్మిల.. ఆ తర్వాత కాంగ్రెస్లో ఆమె పార్టీని విలీనం చేయడంలో డీకే శివకుమార్ ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో వైసీపీ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారంలో డీకే శివకుమార్ పేరు వినిపించడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై డీకే శివకుమార్ స్పందించారు. ఈ మేరకు డీకే శివకుమార్ ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని నేను కలిశానంటూ కొందరు ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని నేనెప్పుడూ కలవలేదు. దీన్ని ఎవరూ నమ్మకూడదు’’ అని ఆయన పేర్కొన్నారు.