Pawan comments : ఇన్నాళ్లు నెలకొన్న అనుమానాలను పవన్ కళ్యాణ్ నివృత్తి చేశారు. ‘స్కిల్ డెవలప్ మెంట్’ కేసులో జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో వపన్ కళ్యాణ్ గురువారం (సెప్టెంబర్ 14) రోజున ములాఖత్ అయ్యారు. ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్న తర్వాత జైలు బయట మీడియా మీట్ నిర్వహించారు. ఆయనతో హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసే పోటీ చేస్తుందని స్పష్టతనిచ్చారు.
ఇన్ని రోజులు దీనిపై స్పష్టత మాత్రమే ఇవ్వలేదని.. కొన్ని రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ రోజు కూడా 40 నిమిషాలు బాలకృష్ణ, లోకేశ్ తో మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. వైసీపీని ఎదుర్కోవాలంటే మరింత స్ట్రాంగ్ కాకతప్పదని అందులో భాగంగానే పొత్తు పెట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు బీజేపీతో జనసేన పొత్తు కొనసాగిస్తుందని, టీడీపీని కలుకొని వెళ్లేదానిపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడతానని ఆయన చెప్పారు. తనను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న విషయం ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని.. ఇప్పుడు బాబు అంశం కూడా తీసుకెళ్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో కూడా మోడీ, చంద్రబాబుకు తను మద్దతిచ్చినట్లు చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నే తాను కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.
నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన కొనసాగుతోందన్న పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడి అరెస్ట్ అని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని రంగాలలో డెవలప్ చేశారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇక వైసీపీ పాలనకు చరమగీతం పాడుతామన్నారు.