Ramoji Rao : ఈనాడు, ఈటీవీ అధినేత రామోజీరావు ప్రస్తుతం మార్గదర్శి చిట్స్ కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసి మార్గదర్శిపై దాడులు కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఏపీ సీఐడీ రామోజీరావు, శైలజా కిరణ్ ను పలుమార్లు ప్రశ్నించింది. రానున్న రోజుల్లో ఈ వేధింపులు మరింత ఉంటాయని అంతా భావిస్తున్నారు. తన ప్రతిష్టతను దెబ్బతీసేలా, పార్టీని దెబ్బకొట్టేలా ఈనాడు రాస్తున్న కథనాలతోనే జగన్ ఇలా ఎదురుదాడికి దిగుతున్నారని రామోజీరావు పత్రికలో కథనాలు వస్తున్నాయి.
అయితే చంద్రబాబును గద్దెనెక్కించేందుకే రామోజీరావు పని చేస్తుంటారనేది అందరికీ తెలిసిందే. మరి రామోజీరావు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అండగా నిలుస్తారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్ పై దాడులు, ఆస్తుల అటాచ్ అంశం ఆయన ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రామోజీని కాపాడేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారని వైసీపీ శ్రేణుల టాక్. అయితే ప్రస్తుతం అమరావతి కేసు కూడా చంద్రబాబుకు చుట్టకునే అవకాశం కనిపిస్తున్నది. జగన్ తన ప్రత్యర్థులే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. రానున్న తొమ్మిది నెలల్లో ఇది మరింత తీవ్రతరం చేసి, వారిని చుట్టుముట్టాలని ఆయన భావిస్తున్నారు. ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసి, వారికి ఎన్నికల్లో ఎలాంటి సహకారం అందకుండా చేయాలని ఆయన పావులు కదుపుతున్నారు. ఇక చంద్రబాబు, రామోజీరావు తర్వాత జగన్ టార్గెట్ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్ అధినేత రాధాకృష్ణపై ఉండబోతుందనేది ఏపీలో టాక్ వినిపిస్తున్నది. అవకాశం కోసం జగన్ ఎదురుచూస్తున్నారని, ఏపీ పోలీసుల సహాయంతో ఆయనను కూడా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం మాత్రమే వీరందరినీ కాపాడే అవకాశం ఉన్నది. చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ కి వెళ్లి ఆదిశగా కేంద్ర పెద్దలతో భేటీ అయ్యారు. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు పై కూడా త్వరలోనే సీబీఐ, ఈడీ దాడులు జరుగుతాయని వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టాయి. అయితే జగన్ మాత్రం సైలెంట్ తన పని తాను కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి అవసరమైనన్ని నిధులు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో కేంద్రం నుంచి ఆయనకు పెద్ద ఎత్తున నిధులు అందాయి. ఏకంగా 30 వేల కోట్ల మేర నిధులు ఏపీకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వైసీపీ అధినేత జగన్ కే మద్దతుగా నిలవబోతున్నదని తెలుస్తున్నది. అయితే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలను టార్గెట్ చేస్తూ దాడులు ఇలాగే కొనసాగితే పవన్ ఎవరివైపు ఉంటారనేది ఇప్పుడు అసలైన విషయం. ఆయన ఇప్పటికైతే చంద్రబాబుతో దోస్తీకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీని కూడా ఇటు వైపు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి రామోజీరావును ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, సీఐడీని కాపాడేందుకు చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.