Merge TDP in BJP : స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకు పైగా జైలు జీవితం గడుపుతున్నాడు. ఆయన అరెస్ట్ నుంచి రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు వైపునకు కొన్ని పార్టీలు ఉంటే.. జగన్ ఏ తప్పూ చేయలేదని వాదిస్తున్న చిన్నా చితకా పార్టీలు కూడా లేకపోలేదు.
చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఆయన చేసుకున్న ముందస్తు బెయిల్ నిరాకరించిన ఏసీబీ, హైకోర్టులు మరో రెండు కేసుల్లో కాస్తంత ఊరటనిచ్చాయి. కానీ బెయిల్ మాత్రం ఇవ్వడం లేదు. బాబును విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని సీఐడీ కోరుతున్నా.. ఈ విషయంలో కోర్టు సంయమనం పాటిస్తుంది. ఇక అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో కూడా విచారణ ఎదుర్కొంటున్నారు బాబు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. అయితే ఈ ప్రాజెక్టులో వందల కోట్ల స్కాం జరిగిందని చంద్రబాబుపై సీఐడీ ఆరోపణలు మోపింది. ఇది అప్పటి కేబినేట్ నిర్ణయమని ఇందులో ఎటువంటి స్కాం జరగలేదని చంద్రబాబు తరుఫు న్యాయవాదులు కోర్టుకు వినిపిస్తుండగా విచారణ మాత్రం జరుగుతూనే ఉంది.
ఈ పరిణామాల మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాను కలిశారు. వీరి భేటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వివిధ వాదనలు పుట్టుకస్తున్నాయి. ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు పురంధీశ్వరి, కిషన్ రెడ్డితో కలిసి లోకేశ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏఏ విషయాలపై భేటీ జరిగిందనే విషయం ఇటు లోకేశ్ గానీ, అటు పెద్దమ్మ పురంధీశ్వరి గానీ కిషన్ రెడ్డి గానీ బయటపెట్టలేదు. సీఎం జగన్ పై ఫిర్యాదు చేయడం ఒక ఎత్తయితే.. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ భేటీకి సంబంధించి అధికారికంగా ప్రకటించే వరకు ఏం జరిగిందనేది చెప్పడం చాలా కష్టంగా కనిపిస్తుంది.