Settlements : టీడీపీ అధికారంలో ఉన్నప్పడు ఇచ్చిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం సెటిల్మెంట్ల పేరిట డబ్బులు గుంజింది. తీరా డబ్బులు కట్టాక అధికార పార్టీ అసలు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నది. ప్రజలను పీల్చిపిప్పి చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నది. ప్రతిపక్ష నేతగా రాష్ర్టమంతా పాదయాత్ర చేసిన జగన్ ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చుకుంటూ వెళ్లాడు. దీంతో ప్రజలు ఆ హామీలను నమ్మి అధికారం ఇస్తే టీడీపీ చేసిన దాని కన్నా ఎక్కవగా వైసీపీ మరింత వేధిస్తున్నది.
తాము అధికారంలోకి రాగానే ఇళ్ల రుణాలన్నింటినీ రద్దు చేసి చేస్తానని జగన్ పాదయాత్రలో పదే పదే చెప్పుకొచ్చాడు. ఇప్పడేమో 1983 నుంచి అంటే ఎన్టీఆర్ కాలంలో ఇళ్ల పథకం తీసుకు వచ్చినప్పటి నుంచి బాకీలు ఉన్నాయని చెప్పి, గృహ లబ్దిదారులను వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇచ్చారు. రూ. ఇరవై వేలు కట్టాలని మభ్యపెట్టారు. ఈ మొత్తం కడితే ఇల్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని, బ్యాంకుల్లో ఇంటి రుణాలు పొందవచ్చని ఆశ జూపారు. ఒక్కో నిరుపేద ఇంటికి పదిమందిని పంపి మరీ డబ్బు వసూలు చేసింది అధికార పార్టీ. అప్పో.. సప్పో చేసిన ప్రజలు డబ్బులు కట్టారు. ఒక్కో ఇంటిపైకి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సలహా పది మంది వరకూ కట్టే దాకా లబ్దిదారులను విడిచిపెట్టలేదు.
డబ్బులు కడితే రిజిస్ట్రేషన్లు అవుతాయని, లేకుంటే ఇండ్లను ప్రభుత్వం జప్తు చేస్తుందని బెదిరింపులకు గురి చేశారు. దీంతో భయపడిన లబ్ధిదారులు అప్పులు తెచ్చి డబ్బులు కట్టారు. కానీ ఇప్పుడు ఆ ఓటీఎస్ స్కీమ్ గురించి ఊసే లేకుండా పోయింది. పేదల నుంచి బలవంతంగా వందల కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన మాట ఎత్తడం లేదు. ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు అప్పు కట్టమని వేధించడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది. ఓటీఎస్ పేరిట డబ్బులు గుంజిన ప్రభుత్వం పేదలకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రం ఇవ్వడం లేదు. అసలు ఆ సంగతే ప్రభుత్వం మరిచింది. వార్డు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఉంటాయని చెప్పినా ఆ జాడే కానరావడం లేదు. అసలు ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి.
తమకు రిజిస్ట్రేషన్ పత్రాలివ్వాలని డబ్బులు కట్టిన వాళ్లంతా ప్రజాప్రతినిధులు, నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో జగన్ మీట నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కొంత మందికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చారు. అయితే పత్రాలు పొందిన వారికి మాత్రం బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. ఆ పత్రాలు చెల్లవని చెప్పడంతో లబ్ధిదారుల అవాక్కవుతున్నారు. ప్రభుత్వాలు ఇంతలా దోచుకుంటాయా అని ప్రశ్నిస్తున్నారు.
ఓటీఎస్ పేరిట డబ్బులు చెల్లించిన వారంతా నిరుపేదలే. వారి పరిస్థితిని అర్థం చేసుకొని గత ప్రభుత్వాలు కూడా మాఫీ జాబితాలో చేర్చేశాయి. కానీ రిజిస్ట్రేషన్లు, లోన్లు పేరిట ప్రజలను మబ్యపెట్టడం వైసీపీకే చెల్లింది. డబ్బులు కట్టిన వారికైనా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసివ్వాలని, బ్యాంకుల్లో రుణాలు ఇప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పేదల్ని అప్పుల పాలు చేయాలనే పథకంలో భాగంగా ఇదంతా జరిగిందనే వాదన వినిపిస్తున్నది. అందుకే వారు సైలెంట్గా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.