Sharmila తెలంగాణలో వైఎస్సాఆర్ టీపీ పెట్టిన షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఛరిష్మాను వాడుకొని ఎదుగాలి అనుకుంది. కానీ ఆమె అనుకున్నంత ఆదరణ తెలంగాణ ప్రజలు ఆమెపై చూపించలేదు. దీంతో పార్టీలోనే ఆమెపై ఆశలు సన్నగిల్లాయి. స్వయానా పార్టీ కీలక నాయకులే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని లేకుంటే డిపాజిట్ల దక్కవని సూచనలు చేస్తూ వచ్చారు. దీంతో ఆమె గతంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కూడా కలిశారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరుతారన్న వార్త లీక్ అయ్యింది.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు షర్మిలను వాడుకోవాలని చూసింది. కానీ ఆమె మాత్రం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. తెలంగాణలోనే మరో ఆఫర్ కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. అందుకే ఆ పార్టీ నిర్ణయం వెలువరించే వరకు తన పార్టీ కార్యక్రమాలలో కూడా ఆమె పాల్గొనడం లేదు.
ఈ నేపథ్యంలో ఆమె ఎదుట కాంగ్రెస్ పార్టీ ఒక షరతు పెట్టిందని తెలుస్తోంది. ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి రేవంత్రెడ్డి ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఒక వేళ పార్టీ గనుక ఖచ్చితంగా ఆమె సేవలను వాడుకోవాలనుకుంటే సికింద్రాబాద్ లోక్సభ బరిలో దింపాలని సూచిస్తున్నారు. ఆమెతో ఈ విషయంపై మరోసారి చర్చలు జరుపుతారని సమాచారం.
ఇక్కడి నుంచి ఆమెను బరిలోకి దింపితే ఈ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుందని బలంగా నమ్ముతుంది. ఈ లోక్ సభ సెగ్మెంట్ లో క్రిస్టియన్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి గెలిస్తే సులువుగా తెలిచే అవకాశం ఉంది. దీనికి తోడు సెటిలర్స్, రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఆమెకే మద్దతిచ్చేలా ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే షర్మిల కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తుందని కాంగ్రెస్ తో పాటు సొంత పార్టీలో కూడా వాదనలు వినిపిస్తున్నాయి.