Heavy Rains తెలంగాణలో వానల తో వచ్చిన వరద పెద్ద బీభత్సాన్ని సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో పల్లెలు నిద్రపోతున్న వేళ వరద ముంచెత్తింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం అత్యంత దీనస్థితిని ఎదుర్కొంది. ఆ పల్లె పరిస్థితిని చూసిన వారంతా అయ్యో పాపం అనుకుంటూ ఆవేదన చెందారు. తమను కాపాడాలని గ్రామస్తులు చేసిన హాహాకారాలు టీవీలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు చూసి వారంతా బాధపడ్డారు
అదమరిచి నిద్రపోతున్న వేళ ఆ పల్లె లోవెయ్యికి పైగా జనాభా వరదలో చిక్కుకుంది. కేవలం అరగంట సమయంలోనే వరద ఒక్కసారిగా పల్లెను ముంచెత్తింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు అంత భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా అర్ధనాదాలతోనే గడిచిపోయింది. ఉదయం అయ్యాకే బయట ప్రపంచానికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలామంది చెట్లు ఎక్కి, దాబాలు ఎక్కి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. తొమ్మిది గంటల పాటు వరదలోనే వణికిపోతూ సాయం కోసం ఎదురు చూశారు. ఉదయం 5 గంటలకు విషయం తెలిశాక అధికార యంత్రాంగం సహాయక చర్యలకు ఉపక్రమించింది. ఊరి పరిస్థితి చూసి వెంటనే కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
రెండు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఎస్పీ కరుణాకర్ వెంటనే ఆ గ్రామానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు రంగంలోకి దిగిన యంత్రాంగం దాదాపు 1000 మందిని పడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు. చెట్లపై దాక్కున్న ఎనిమిది మందిని హెలికాప్టర్ల ద్వారా కాపాడారు. వారందరికీ అప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందించారు. అయితే గ్రామానికి చెందిన ఐదుగురు వరదలో గల్లంతయినట్లు తెలుస్తున్నది. ఇప్పటికి కూడా ఆ గ్రామాన్ని వరద వీడలేదు.