TDP New president AP : ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా.. అంటే అవుననే అంటున్నాయి శ్రేణులు. ఏపీలో టీడీపీ ప్రస్తుత అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ అర్థిక మూలాలన్నింటినీ దెబ్బ కొడుతూ వచ్చింది. శ్రేణులను భయబ్రాంతులకు గురి చేసి, ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసింది. పలువురిపై కేసులు, బెదిరింపులతో ఇబ్బందులకు గురి చేసింది. ఇక ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు ఏకంగా పార్టీ అధినేత మీదే అటాక్ మొదలుపెట్టింది. ఆయన పై స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ సీఐడీ చేత అరెస్ట్ చేయించింది. అక్కడితో ఆగకుండా వరుసగా ఏడు కేసుల్లో చంద్రబాబు పేరును చేర్చింది. మరిన్ని కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నది.
ఇప్పటివరకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఏపీకి అచ్చెన్నాయుడు, తెలంగాణకు కాసాని అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు రెండు రాష్ర్టాల అధ్యక్షులుగా కొత్తవారిని నియమించే చాన్స్ కనిపిస్తున్నది. ఇక ఏపీపైనే ప్రస్తుతం చంద్రబాబు దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులను వైసీపీకి దీటుగా నడిపించే నాయకుడికే ఈసారి అవకాశం ఇఛ్చే చాన్స్ కనిపిస్తున్నది. అచ్చెన్నాయుడిని ఈసారి కొనసాగించే చాన్స్ లేదని తెలుస్తున్నది. అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎంపీ రామ్మోహన్ నాయుడి వైపు అధినేత మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కానీ పార్టీలో మంచి వాగ్ధాటి, పార్టీకి కట్టుబడి పనిచేసే వ్యక్తిగా పేరున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వైపు పార్టీ యువ నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. వీరిద్దలో ఎవరో ఒకరికి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.
అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడంలో ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పూర్తిగా విఫలమైనట్లు సమాచారం. దీంతో పాటు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన ఎక్కడా శ్రద్ధ చూపలేదు. అయితే కష్టకాలంలో పార్టీని దీటుగా నడిపించే నేతకే ఈ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది. మరి ఎవరికి చాన్స్ దక్కుతుందో వేచిచూడాలి.