Teenamar Mallanna :
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలు అర్పించి తీసుకొచ్చిన తెలంగాణ దారి తప్పిందనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పార్టీ లక్ష్యలు, ఆశయాలు తరువాత వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పుడైతే పార్టీ పేరును ఖరారు చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ పేరు, ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోపు తెలియజేయాలని ఈసీఐ వెబ్ సైట్ లో పేర్కొంది. తీన్మార్ మల్లన్న (మాదాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా), పార్టీ కార్యదర్శిగా మాదం రజినీ కుమార్ (ధర్మసాగర్, వరంగల్ జిల్లా), కోశాధికారిగా ఆర్. భావన (చంపాపేట్, సరూర్ నగర్, హైదరాబాద్) ఉన్నారు.
తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో స్థాపించి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. తెలంగాణ కోసం పలుమార్లు జైలుకు వెళ్లిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు పార్టీ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల సమరంలో తేల్చుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నోసార్లు తమ అక్కసు వెళ్లగక్కిన మల్లన్న ఇప్పుడు పార్టీ ద్వారా తన భావజాలం ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ కోసం పలు పార్టీలు వచ్చినా కొత్తగా వచ్చే తెలంగాణ నిర్మాణ పార్టీ నిలబడుతుందా? ఎన్నికల్లో తన ప్రభావం చూపుతుందా? అనేది తేలాల్సి ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణ ఉద్యమ పార్టీలు ప్రభావం చూపడం లేదు. కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి కూడా అంతగా పేరుకు రాలేదు. దీంతో ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టే పార్టీ ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.