Rahul sipligunj : ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత సోమవారం (ఆగస్ట్ 21)న వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే బీఆర్ఎస్ నేతల లిస్ట్ ను ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ రిలీజ్ చేశారు. ఇక బీజేపీ అతి త్వరలో అని ప్రకటించగా.. గాంధీ భవన్ కు కాంగ్రెస్ ఆశావహులు క్యూ కడుతున్నారు.
బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ రెండు పార్టీలు శక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కేసీఆర్ గోషామహల్ లో అభ్యర్థి పేరును పెండింగ్ లో పెట్టాడు. కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ లో విస్తృతంగా పర్యటిస్తూ ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పావులు కదుపుతున్నాడు. ఎంఐఎం నేతలతో ఇప్పటికే రహస్య మీటింగ్ లు సైతం నిర్వహించారని టాక్. బలమైన నేతను రంగంలోకి దింపి కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.
ఇక కాంగ్రెస్ నుంచి మెట్టు సాయి కుమార్ ఎప్పటి నుంచో ఈ టికెట్ కోసం ఆరాటపడుతున్నారు. దీనిలో భాగంగా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నాడు. నియోజకవర్గం ఏర్పాటైన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖేశ్ గౌడ్ ఇక్కడి నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం సాయి కుమార్ ఆశిస్తుండగా పార్టీ అధిష్టానం మత్రం కొత్త పేరును వెలుగులోకి తీసుకువచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి బరిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను నిలబెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ స్థానికుడు కావడం, సింగర్ గా రాష్ట్ర వ్యాప్త, ఇప్పుడు దేశ వ్యాప్త గుర్తింపు ఉండడంతో ఆ అవకాశాలను వినియోగించుకోవాలని పార్టీ యోచిస్తున్నట్లు టాక్. ఇదే జరిగితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఫైట్ సాగుతుందని స్థానికుల నుంచి టాక్ వినిపిస్తుంది.