Triangular Alliance : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులంటూ లెక్కలు వేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లాయి. జంటగా ఎన్నికల్లో పోటీకి దిగాయి. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా నాటి నుంచి పవన్ బీజేపీ తో మిత్ర బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన టీడీపీతో కూడా జతకట్టడానికి సిద్ధమయ్యారు. తనతో ఉన్న బీజేపీని కూడా టీడీపీతో కలిసి రావాలని కోరుతున్నారు. ఆ మేరకు బీజేపీ అగ్రనేతలతోనూ ఆయన ముందుండి చర్చలు జరిపారు. అయితే వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చబోం అంటూ ఆయన ఈ పొత్తులకు అంతా సిద్ధం చేస్తున్నారు. మరి టీడీపీ, జనసేన బంధం పూర్తి బలంగా మారుతుందా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు కొంత సంశయాన్ని రేకెత్తిస్తున్నాయి.
అయితే పవన్ బీజేపీ తో కాపురం చేస్తున్నారని, టీడీపీతో సహజీవనం చేస్తున్నారంటూ ఇన్నాళ్లూ ప్రత్యర్థులు వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు జనసేనాని మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని కోరడం ఇప్పుడు అంతా సంచలనం రేపుతున్నది. అయితే ఇప్పుడు మిత్ర బంధం ఉన్నట్టా.. లేనట్టా అనే సంశయం అందరిలో కలిగింది. అయితే వీరి బంధంపై ఇప్పుడు నెలకొన్న ప్రతిష్టంభన అందరిలో చర్చ మొదలైంది. బంధం ఉంటే కొందరి సీట్లు గల్లంతు కానున్నాయి. మరికొందరికి సీట్లు రానున్నాయి. మరికొందరు టీడీపీతో పొత్తు లేకుంటే జనసేనలో.. జనసేనతో పొత్తు లేకుంటే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరందరికీ సమాధానం దొరకాలంటే మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ ఇప్పటివరకు సైలెంట్ పాత్ర పోషించింది. ఇటీవల మాత్రం వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. మరోవైపు కేంద్రం మాత్రం వైసీపీకి సైలెంట్ గా సహకరిస్తున్నది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పొత్తుల పై క్లారిటీ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇరు పార్టీల నేతలెవరూ దీనిపై బహిరంగ వేదికల్లో విమర్శలకు దిగకూడదని అధినేతలు ఇప్పటికే ఆదేశించారు. కేవలం పవన్ వ్యాఖ్యలతోనే ఇప్పుడంతా ఉత్కంఠ నెలకొంది. అయితే పవన్ మాత్రం అభిమానుల కోరిక మేరకే అలా అన్నాని సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పొత్తులకు చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావని కొందరు మాట్లాడినట్లు సమాచారం. అయితే టీడీపీ నేతలు మాత్రం పవన్ వ్యాఖ్యలపై ఎక్కడా స్పందించలేదు. అధినేత ఆదేశాలే ఇందుకు కారణమని అంతా అనుకుంటున్నారు. అయితే టీడీపీ తో పవన్ బంధం ఏంటనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇప్పటికైతే పవన్ ప్రసంగం కేవలం అధికార వైసీపీ పై విమర్శలకే పరిమితమైంది. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత పెంచే అవకాశం కూడా ఉన్నది. వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా ఆయన మాట్లాడుతున్నారు. తనపై విమర్శలకు గట్టిగా సమాధానమిస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేల సంగతి 2024 ఎన్నికల్లో చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.