Unbreakable Determination : తెలుగు రాష్ర్ట రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. అసలే ఎన్నికల సమయం కావడంతో చిత్రవిచిత్ర విన్యాసాలు తెలుగు రాష్ర్టాల్లో కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఒకలా, ఏపీలో మరొకలా ఈ రాజకీయ చిత్రం ప్రజలకు కనిపిస్తున్నది. ఏదేమైనా తెలుగు రాష్ర్టాల అభివృద్ధి విషయమై ఇప్పడొక చర్చ మాత్రం మొదలైంది. తెలుగు రాష్ర్టాల అభివృద్ధి ఘనత ఎవరిదనే ఒక సంశయం ఇప్పుడు అందరిలో కలుగుతున్నది.
హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టాను అంటేనే టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఎగతాళి చేసిన ఓవర్గం ఇప్పుడు ఆలోచనలో పడింది. 1997లో అంకురార్పణ పడిన హైటెక్ సిటీ నేటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. లక్షల కోట్ల ఆదాయం, ఉద్యోగాలు రాష్ర్టానికి అందిస్తున్నది. మరోవైపు సైబరాబాద్ సిటీ నిర్మితమైంది. వీటన్నింటికీ పునాది ఎక్కడ పడింది అని ఆలోచించలేకపోయింది. మరోవైపు రాయలసీమలో చూసుకుంటే 1300 కోట్లతో కట్టిన పట్టిసీమ ప్రాజక్టు రైతులకు సాగు నీటిని అందిస్తూ ఎన్నో ఎకరాల్లో భూములను సస్యశ్యామలం చేస్తున్నది. విజన్ 2020 పేరిట నాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అనుకున్నట్లుగానే నేడు ఫలాలనందిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే..
ప్రస్తుతం తెలంగాణలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేటికీ నీలినీడలు పోలేదు. ప్రాజెక్ట్ కోసం రాష్ర్ట ప్రభుత్వం లక్షల కోట్లు ధారపోసింది. ఆ తర్వాత వర్సాలకు టర్బైన్లు మునిగిపోయాయి. ఇప్పుడు తాజాగా పిల్లర్ ఒకటి కుంగిపోయింది. దీనిని సంఘ విద్రోహ శక్తుల కుట్రగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తి పోసేందుకు ఏటా వేల కోట్ల కరెంట్ బిల్లులను రాష్ర్ట ప్రభుత్వమే భరించాల్సి వస్తున్నది. ఇదంతా అదనపు భారం. కాళేశ్వరం ప్రాజక్టు ఎన్ని ఎకరాలను తడిపిందో, ఎన్ని గొంతులను తడిపిందో తెలియదు కానీ.. లక్షల కోట్లు మాత్రం నీటి పాలయ్యాయి. హైదరాబాద్ అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుందామనుకున్నా, ఇప్పుడు సెటిలర్ల ఆందోళనలతో అది కూడా ప్రశ్నార్థకమైంది. నిజానికి చంద్రబాబు తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకున్న ఘనత బీఆర్ఎస్కు, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కే దక్కుతుంది. కానీ తామే మొత్తం చేశామంటూ చెప్పుకోవడం రాజకీయ నాయకులుగా వారి కర్తవ్యం. కానీ అది ఎక్కడో బెడిసికొట్టింది.
ఇక ఏపీలో సీఎం జగన్ వరకు చూసుకుంటే అసలు అభివృద్ధి నినాదమే లేదు. కేవలం సంక్షేమ పథకాల అమలు మినహా రాష్ర్టంలో అభివృద్ధిని పడకేసింది. పోలవరం సహా ఎన్నో అభివృద్ధి పనులను అటకెక్కించింది. ఇక రాష్ర్ట ప్రయోజనాలను తన కేసుల కోసం ఫణంగా పెట్టారని అపవాదు మాత్రం సీఎం జగన్ మూటగట్టుకున్నారు. బటన్ నొక్కితే సరిపోతుంది.. ప్రజలకు ఇంకేం అవసరం లేదు అన్నట్లుగా అక్కడి సీఎం తీరు ఉంది. అడిగితే బెదిరింపులు, కేసులు జనాలకు బోనస్. ఇప్పడు ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో జనాలు బేరీజు వేసుకుంటున్నారు. ఇక్కడే కాదు రెండు తెలుగు రాష్ర్టాల్లో అదే పరిస్థితి. లేదంటే తెలంగాణలో ఉధ్యమ పార్టీగా బీఆర్ఎస్కు ఇప్పుడు ఎన్నికల్లో కష్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. అసలు అవకాశమే లేని కాంగ్రెస్ ఎందుకు దూసుకువచ్చింది.
ఇక ఏపీలోనూ అదే పరిస్థితి. భస్మాసుర హస్తంలా జగన్ తన గొయ్యిని తానే తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నది. లేదంటే ఈ ఎన్నికల సమయంలో ఒక పార్టీ అధినేతను, అది కూడా రాష్ర్టానికి 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని జైలుకు పంపించడం కక్షసాధింపు ధోరణి కాకుంటే, ప్రజలు మరోలా ఎందుకు భావిస్తారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన ఏదో చేశారు అని చెప్పేందుకు ప్రభుత్వం, వైసీపీ నేతలు, కొందరు అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు చేసిన అభివృద్ధినే ప్రపంచమంతా ఉన్న తెలుగు జనం ఎలుగెత్తి చాటింది.