TDP Janasena : ఏపీలో ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నది. ఇన్నాళ్లు పొత్తులంటూ చెబుతున్నా, టీడీపీ, జనసేన మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించడం లేదు. బీజేపీ కూడా ఎటూ తేల్చుకోలేకపోతుున్నది. ఇటు టీడీపీ, అటు వైసీపీతో సమాన దూరం పాటిస్తున్నది. అయితే జనసేన, టీడీపీ పొత్తు ఖాయమని బలంగా వినిపిస్తున్నా, అధినేతలు అదే ప్రకటనలు చేస్తున్నా ఇప్పటివరకు శ్రేణుల్లో ఆ దిశగా ఎలాంటి సూచనలు రాలేదు. దీంతో రెండు పార్టీల్లో ప్రస్తుతానికైతే అయోమయ పరిస్థితి నెలకొంది. పొత్తులు ఎలా ఉంటాయి.. ఎక్కడ సీట్లు చేతులు మారుతాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికైతే రెండు పార్టీల నేతలు అన్ని నియోజకవర్గాల్లో తమ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అనంతరం టీడీపీలో కొంత జోష్ వచ్చింది. పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనే భావనలో ఉంది. అయితే జనసేన అడిగినన్ని సీట్ల విషయంలో మాత్రం కొంత తర్జనభర్జన పడుతున్నది. ఇవన్నీ పక్కనపెడితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మరోసారి పొత్తుల అంశం తెరపైకి తెచ్చాయి. టీడీపీ ఒంటరిగా 9 చోట్ల, జనసేనతో పొత్తుతో 2 చోట్ల గెలవగలిగింది. అయితే ఇప్పడు అధికారంలో ఉన్న వైసీపీని సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బ కొట్టాల్సిందే ఇటు జనసేనతో పాటు బీజేపీ అవసరం కూడా టీడీపీకి ఉంది. మరో వైపు ఆ రెండు పార్టీలకు కూడా టీడీపీతో అదే స్థాయిలో అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలన్నీ పొత్తులపై చర్చించేందుకు మరోసారి దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఓటు చీలనివ్వమనే ఏకైక లక్ష్యంతో జనసేనాని పావులు కదుపుతుంటే, ఎలాగైనా అధికార పీఠమెక్కాలనే ఆలోచనతో టీడీపీ ముందుకు సాగుతున్నది. ఇప్పుడు గెలవకుండా చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే భయం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నాయకులు కేసులతో జైళ్లపాలవుతున్నారు. ఇక వైసీపీ మరోసారి గెలిస్తే ఏం జరుగుతుందో వారికి అర్థమైపోయింది.
అయితే పొత్తులు తేలితే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తు్న్నది. ఎన్నికలకు ముందు వారు తీసే అస్ర్తాలతో ఈసారి వైసీపీ అధినేత జగన్ కు దిమ్మతిరగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో నే వలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇటీవల చంద్రబాబు టూర్ లో కూడా పోలీసుల అత్యుత్సాహం టీడీపీకే మైలేజీని తెచ్చిపెట్టింది. మరోవైపు యువగళం పాదయాత్ర, వారాహి యాత్రకు జననీరాజనం పలుకుతున్నారు. ఇప్పటివరకు వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలనే నమ్ముకొని ప్రజల్లోకి వెళ్లడం లేదు. అవే మమ్మల్ని గెలిపిస్తాయంటూ ఆపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఎన్నికలకు మరో ఎనిమిది నెలలే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రజల మనసు ఎటు వైపు తిరుగుతుందో వేచి చూడాలి.