Team India : టీమిండియా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు సూచించినా తమ వైఫల్యాలను మార్చుకోదు. ఫలితంగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంటుంది. అభిమానుల ఆగ్రహానికి గురవుతూనే ఉంటుంది. సులభంగా గెలవాల్సిన మ్యాచులను సమర్పించుకుని అపవాదును మూటగట్టుకుంది. అయినా గుణపాఠం నేర్చుకోదు. టీమిండియా అపజయాలతో పాఠం ఎప్పటికి నేర్చుకుంటుందో?
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా వన్డే, టెస్టుల్లో విజయం సాధించినా టీ20లో మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. కరేబియన్ ధాటికి విలవిలలాడింది. పరుగులు సమర్పించుకుని పరువు పోగొట్టుకుంది. ప్రపంచ కప్ కు ముందు ఇలాంటి పరాజయాలు భయపెడతాయి. వెస్టిండీస్ ఆటగాళ్లలో పూరన్, రోవ్ మన్ పావెల్, బ్రాండన్ కింగ్, షైహోప్ వంటి వారి బ్యాట్లకు జడుసుకుంది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ 2023 తరువాత ఆసియా కప్ 2023 మినీ టోర్నీకి ముందు భారత్ చేసిన పర్యటన ఇదే. దీంతో ఇక్కడ మూడు వన్డేలు, రెండు టెస్టులు, ఐదు టీ 20లు ఆడింది. మన యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ముకేష్ కుమార్, తిలక్ వర్మలకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా సీనియర్లు మాత్రం సత్తా చాటలేదు.
వెస్టిండీస్ పర్యటనలో హార్థిక్ పాండ్యా చేసిన ప్రయోగాలు ఫలించలేదు. అతడి కెప్టెన్సీలో పరాజయాలు మూటగట్టుకుంది. బౌలర్ల సేవలు వినియోగించుకోవడంలో విఫలమయ్యాడనే ఆరోపణలున్నాయి. వికెట్లు తీసే వారికి అవకాశం ఇవ్వకుండా పరుగులు సమర్పించుకునే వారికి బంతి ఇవ్వడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఇలా విండీస్ పర్యటనలో భారత్ పరువు పోగొట్టుకుంది.