Yarlagadda Venkatrao : ఓడ దాటే దాక ఓడ మల్లయ్య.. ఓడ దాటాకా బోడి మల్లయ్య అన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. తనకు అవసరం ఉన్నప్పుడు ఒకలా.. అవసరం తీరాక ఒకలా వ్యవహరిస్తున్నారనడానికి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన వైఎస్ షర్మిల.. వైఎస్ విజయమ్మలే పెద్ద ఉదాహరణగా కన్పిస్తోంది.
తల్లి విజయమ్మ.. చెల్లి షర్మిలా.. సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద.. ఆయన కూతురు సునీత విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు చూస్తుంటే ఆయన నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నప్పుడు ఆయన స్థానంలో వైఎస్ షర్మిలా ఏపీలో పాదయాత్ర చేసింది. జగన్ వదిలిన బాణం అంటూ గొప్పగా చెప్పుకొంది.
జగన్ అధికారంలోకి రావడానికి ఆమె చేసిన పాదయాత్ర కూడా తోడ్పింది. అయితే అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆమె పార్టీకి పూర్తిగా దూరం పెట్టారు. అంతేకాకుండా ఆస్తి పంపకాల్లో గొడవ కారణంగా ఆమెను ఏపీ నుంచి పూర్తిగా తరిమేశారనే ప్రచారం కూడా ఉంది. షర్మిలకు అండగా నిలిచిన ఆమె తల్లిని కూడా పార్టీ గౌరవ అధ్యక్ష పదవీ నుంచి తప్పించారనే వాదనలు ఉన్నాయి. సొంత వారికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఆ పార్టీలోని నేతల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా వైసీపీ గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావ్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైనట్లు కన్పిస్తోంది. గన్నవరంలో పార్టీ ఎదుగుదల కోసం తాను కోట్లు ఖర్చు పెట్టానని చెబుతున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు లేకుండా పోయిందని వాపోతున్నారు. దీనికి తోడు తనకు పొమ్మనలేక పొగబెడుతున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నారట. తనతో కోట్లు ఖర్చు పెట్టించి ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లగొట్టాలని చూస్తుండటంపై ఆయన ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఏదిఏమైనా ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో యార్లగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.