దేవుళ్లు సినిమా చూసే ఉంటారు. అందులో వాళ్ల అమ్మ-నాన్నలకు కోసం పిల్లలు ఎంత కష్టపడుతారో తెలిసిందే. అయ్యప్ప స్వామికి మొక్కుకొని ఆయన దర్శనం కోసం ఎంతగానో ఇబ్బంది పడుతారు. వారి తల్లిదండ్రులను కలిపేందుకు ఈ సినిమాలో ఆ చిన్నారులు గట్టి ప్రయత్నమే చేస్తారు. అయితే ఇలాంటి ప్రయత్నాన్నే నిజామాబాద్ జిల్లాలో ఓ ఇద్దరు చిన్నారులు చేశారు.
ఇటీవల రాష్ట్ర సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 317తో చాలా మంది టీచర్లు అవస్థలు పడుతున్న విషయం విధితమే. ఈ జీవో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్న అనేక మంది భార్యా,భర్తలను విడదీసింది. చెట్టుకోకరు పుట్టకోకరు మాదిరి వేర్వేరు జిల్లాల్లో దంపతులకు పోస్టింగ్స్ వచ్చాయి. దీంతో చాన్నాళ్లుగా తమను స్పౌజ్ కోటాలోనైనా ఒక్కే జిల్లాకు కేటాయించాలని కోరుతున్నారు. అయితే వీరెన్ని విన్నపాలు చేసిన ప్రభుత్వం స్పందించడం లేదు.
ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న ఇద్దరు టీచర్ దంపతుల పిల్లలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ అమ్మ-నాన్నలను కలపాలని మండుటెండల్లో నిరసన చేస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని సర్కార్కు ఆపిల్లలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తమ పేరెంట్స్ను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని వేడుకుంటున్నారు. అయితే తల్లిదండ్రుల కోసం ఇలా పిల్లలు రంగంలోకి దిగి నిరసన తెలుపుతుండడం వినూత్నంగా ఉండడంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్గా మారింది.