తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ. సినిమారంగంలో రారాజుగా వెలిగిపోతున్న నందమూరి తారకరామారావు తనని ఆదరించి తిరుగులేని స్టార్ డంని అందించిన ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ” తెలుగుదేశం ” పార్టీని స్థాపించాడు. 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అంటే టీడీపీ పార్టీ పుట్టి 41 సంవత్సరాలు అన్నమాట.
పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించాడు ఎన్టీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యువకులను , చదువుకున్న వాళ్ళను పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టి అనామకులను సైతం ఎమ్మెల్యేలుగా , మంత్రులుగా చేసిన ఘనమైన చరిత్ర ఎన్టీఆర్ సొంతం. బడుగు , బలహీన వర్గాల నుండి అత్యధికులు నాయకులుగా ఎదగడానికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేసారు. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాల వల్లే ఈరోజు చాలామంది నాయకులుగా ఎదిగారు.
పరిపాలనలో కూడా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు ఎన్టీఆర్. పేదలకు జనతా వస్త్రాలు , 2 రూపాయలకే కిలో బియ్యం పథకం , మహిళలకు ఆస్తిలో వాటా , పక్కా ఇళ్ల నిర్మాణ పథకం పేరుతో గూడు లేని పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థానిక సంస్థల్లో బడుగు , బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం ద్వారా బడుగు , బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాడు.
దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించిన చరిత్ర ఎన్టీఆర్ సొంతం. ఒక ప్రాంతీయ పార్టీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం కూడా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. ఆ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు చేసి పరిపాలన సాగించినప్పటికీ 1989 లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైంది.
ఆ తర్వాత మళ్ళీ 2004 లో భారీ మెజారిటీతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ 8 నెలల కాలంలోనే చంద్రబాబు రూపంలో ఆగస్టు సంక్షోభం నెలకొంది. దాంతో ఎన్టీఆర్ పదవీచ్యుతుడు అయ్యాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు …… తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్లాయి. అప్పటి నుండి చంద్రబాబు నేతృత్వంలోనే తెలుగుదేశం ముందుకు వెళుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయ్యాడు నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో టీడీపీ అస్తిత్వం కోల్పోయింది. అలాగే ఏపీలో కూడా పార్టీ ఘోర ఓటమి చవి చూసింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు పార్టీకి సంజీవనిలా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి ఊపిరినిచ్చాయి. దాంతో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం మాదే అనే ధీమా వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం.
41 సంవత్సరాల టీడీపీ ……. పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. సంక్షోభం తలెత్తిన ప్రతీసారి తట్టుకొని నిలబడి …….. సత్తా చాటుతూనే ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆశాభావంతో ముందడుగు వేస్తూనే ఉంది. ఈరోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మళ్ళీ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.