Pawan వారాహి యాత్రతో దూకుడు పెంచి జనసేన అధినేత పవన్ రోజురోజుకూ అధికార పార్టీపై మరింత విరుచుకపడుతున్నాడు. అధికార పార్టీ పాలన తీరును ఎండగడుతున్నారు. అయితే వలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలపై పలు చోట్ల విమర్శలు వస్తున్నా పవన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకు వలంటీర్లను కించపర్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కాదని స్పష్టం చేస్తున్నారు. అయితే వలంటీర్లు కొందరు చేసిన అకృత్యాలు, అక్రమాలతో మిగతా వారందరికీ చెడ్డ పేరు వస్తుందని, అలాంటి వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని అధికార పార్టీని ప్రశ్నిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వలంటీర్లతో సేకరించడం సమంజసం కాదనే కోణంలో మాత్రమే తానీ వ్యాఖ్యలు చేశానని ఇప్పటికీ అదే మాట ఉన్నాడు పవన్. అయితే పార్టీ కార్యకర్తల సమావేశంలో సచివాలయాలపై చేసిన వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తున్నది. రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను తీసుకు రావడంపై పవన్ ప్రశ్నలు లేవనెత్తారు. ఉన్న వ్యవస్థను సరైన మార్గంలో నడిపించలేనప్పుడు సమాంతర వ్యవస్థలు తీసుకురావడం అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు పవన్.
పంచాయతీల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉంటారు. వాళ్లను కాదని వలంటీర్లతో అధికారిక పనులు చేయించడం చట్ట విరుద్ధం. వలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత కల్పించేందుకు జగన్ ఆర్డినెన్స్ తెచ్చారు. అయితే ఆ ఆర్డినెన్స్ చట్టం చేయలేదు. పంచాయతీ విధులను సచివాలయాలకు ఇవ్వడం చట్ట విరుద్ధమని పవన్ ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తున్నది.
వలంటీర్లకు నష్టం వాటిల్లుతుందని పవన్ పేర్కొంటున్నారు. వాళ్లకు ఆపద వస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. వలంటీర్లు సేకరించిన సమాచారం బయటికి వెళితే ప్రజలకు ఎవరు జవాబుదారీ అని పవన్ సంధిస్తున్న ప్రశ్నలు అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. సమాంతర వ్యవస్థ కాకుండా ఉన్న వాటితో పనులు చేయించడం ప్రభుత్వం బాధ్యత అని పవన్ చెబుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో లేని సమాంతర వ్యవస్థను నడపడం చెల్లుబాటు కాదని, జరిగే పరిణామాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు.