టీకాంగ్రెస్లో కొత్త నినాదం తెరపైకి వస్తోంది. ఆపార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేయాలనే ప్రచారం ఊపందుకుంటోంది. తెలంగాణ ఉద్యమ టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే దళిత సీఎం అభ్యర్థి గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడినే ముఖ్యమంత్రిని చేసేందుకు సహకరిస్తానని ప్రకటించారు.
అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదు. దళిత సీఎం ముచ్చటను మరుగున పడేశారు. తెలంగాణ పునఃనిర్మాణం కావాలంటే తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. దీంతో అప్పట్లో దళిత సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఉద్యమ సమయంలో చేసిన జిమ్మిక్కులను తర్వాత కాలంలో కూడా కేసీఆర్ మరచిపోలేదు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ,దళిత బంధు పేరుతో వారిని ఊరించారు.
ఇక బీఆర్ఎస్ రెండుసార్లు అధికారం చేపట్టినప్పటికి కేసీఆర్ ఇచ్చిన హామీలను సరిగ్గా నేరవేర్చలేక పోయారు. దీంతో అటు కేసీఆర్ విస్మరించిన దళిత బంధు,మూడెకరాల భూ పంపిణిపై కూడా ఆ వర్గాల్లో పెద్ద ఎత్తున సర్కార్పై విమర్శలు మొదలయ్యాయి. ఈసారి రాబోయే ఎన్నికల్లో దళిత సామాజిక వర్గాల నుంచి కేసీఆర్కు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భారాసపై ఉన్న దళిత వ్యతిరేకతను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆపార్టీలోని పలువురు కోరుతున్నారు.
ఈ విషయంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడం ఒక్కటే ఉత్తమమనే వాదనను వినిపిస్తున్నారు. అందులో భాగంగా జడ్సన్ లాంటి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుల ద్వారా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు లేఖలు కూడా రాయిస్తున్నారు. ఖర్గే కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతనే అయినందున ఆయన కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని ఒప్పించేందుకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.