Chennuru Politics : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో బరిలో నిలిచే అభ్యర్థిపై ఉత్కంఠ వీడడం లేదు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖరారయ్యారు. కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో భాగంగా చెన్నూరును సీపీఐకి కేటాయిస్తారన్న ప్రచారనే కొద్ది రోజులుగా సాగుతున్నది. దీంతో ఇరు పార్టీల శ్రేణుల్లోనూ ఆందోళన నెలకొన్నది. పొత్తులో ఏ పార్టీకి సీటు దక్కుతుందో తెలియని ఆయోమయ పరిస్థితులు నెలకొనగా నేడు ఉత్కంఠ వీడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా కొత్తగూడెంతోపాటు చెన్నూరు నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయిస్తూ కాంగ్రెస్ అదిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిఖనిలో నిర్వహించిన రాహుల్ గాంధీ రోడ్ షోలో కాంగ్రెస్ నాయకులు చెన్నూర్ స్థానాన్ని సీపీఐ కి కేటాయించవద్దని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. అయితే బుధవారం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అధికారికంగా సీటు ఎవరికనే విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో చెన్నూరుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఉన్నాయి.
చెన్నూరు స్థానం ఆశిస్తూ కాంగ్రెస్ నుంచి 14 మంది ఆశావహులు ఎవరికి వారే ఎన్నికల ప్రచారం చేపట్టారు. అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా తమ ప్రయత్నాలు చేసుకున్నారు. వామపక్షాల పొత్తులో ఈ స్థానం సీపీఐకి కేటాయిస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఆందోళనకు గురై ప్రచారం విషయంలో వెనక్కి తగ్గారు. ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ను కాదని సీపీఐకి కేటాయించడంపై పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. ఇంతకాలం క్షేత్రస్థాయిలో ప్రచారం సాగించిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆందోళన చెందుతున్నారు. అయితే కార్మిక క్షేత్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం అధికార పార్టీ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు. అధిష్ఠానం ఓదెలు వైపు మొగ్గుచూపుతుందని ప్రచారం జరిగింది. సీపీఐకి కేటాయిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. అధికారికంగా ప్రకటన వెలువడిన అనంతరం ఓదెలు తమ అనుచరవర్గంతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
చెన్నూరుపై సీపీఐ అంతగా దృష్టి సారించకపోవడంతో నియోజకవర్గంలో ఆపార్టీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. నియోజకవర్గంలో ఎవరి పేరు ఖరారు కాకపోగా మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప అభ్యర్థి ఎవరనేది తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్లోకి ఓ కీలక నేత?
బీజేపీకి చెందిన ఓ కీలక నేత కాంగ్రెస్లో చేరుతున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్నది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకే ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ స్థానం సీపీఐకి కేటాయిస్తున్నారనే అంశం తెరపైకి రావడంతో అంతా కంగుతింటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని.. చివరి నిమిషంలో రాజకీయ పరిస్థితులు మారడం సహజమని విశ్లేషకులు భావిస్తున్నారు.