congrees తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన దూకుడు మరింత పెంచనుంది. అన్ని వర్గాల్లోకి వెళ్లి ఈసారి పార్టీని గెలిపించుకోవాలని అగ్రనాయకత్వం ప్రయత్నిస్తున్నది. ఈసారి బీసీ ఓటు బ్యాంకు పై ప్రధానంగా ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 30న పార్టీ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా, ఆమెతోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలుస్తున్నది. అయితే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే రాష్ట్రంలో తన సర్వే పూర్తి చేశారు. పార్టీ ఎక్కడెక్కడ వెనుకబడి ఉందో అని రిపోర్టును కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ రిపోర్టును ఆయన పెద్దల ముందు ఉంచారు.
రాష్ట్రంలో పార్టీ బలం, బలహీనతలపై రాష్ట్ర నాయకత్వం సునీల్ కనుగోలు నుంచి పూర్తి వివరాలు తీసుకుంది. ఎన్నికలకు మరో మూడున్నర నెలల సమయం కీలకంగా ఉండడంతో ప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని.. ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నది. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళా సంక్షేమం పై డిక్లరేషన్లు పూర్తిచేసి ప్రచారానికి వెళ్లాలని భావిస్తున్నది. ఇప్పటికే ఈ డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీల ను వేసినట్లు సమాచారం. వీటి రూపకల్పన ప్రక్రియ కూడా పూర్తయ్యిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు వీటిని ప్రకటించడం ద్వారా అధికార పార్టీని దెబ్బతీయాలను భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
అయితే చాలా చోట్ల ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 34 మంది బీసీ అభ్యర్థులను అసెంబ్లీ ఎన్నికలకు బరిలోకి దింపాలని అనుకుంటున్నారు. ఆగస్టు 15 కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ గర్జన సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నది. ఈ సభలోనే ఈ డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఈనెల 30న కొల్లాపూర్ లో జరిగే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. అయితే పార్టీ ఎక్కడ వెనుకబడి ఉందనే విషయంపై ఇప్పటికే వ్యూహకర్త సునీల్ కనుగోలు ఒక నివేదికను పార్టీ అగ్ర నేతలకు అందించారు. రాష్ట్రంలో మొత్తంగా ఐదు ఎంపీల స్థానంలో పరిధిలో పార్టీ చాలా వెనుకబడి ఉందని ఆయన సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. వీటిపై ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు, ఆయా చోట్ల బలమైన అభ్యర్థులపై ఆరా తీస్తున్నారు. అతి త్వరలో నిర్వహించే బీసీ గర్జన సభకు రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సీతారామయ్యను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతిపాదించారు.
ఏదేమైనా ఈ మూడున్నర నెలలు అధికార పార్టీకి అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర మొత్తం చుట్టుముట్టాలని, ప్రభుత్వ ఆగడాలను వివరించాలని తీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలంతా నిర్ణయించారు. ఇప్పటికే వారంతా కలిసి సమాలోచనలు జరిపారు. ఏదేమైనా ఈసారి కలిసికట్టుగా ఎన్నికల్లోకి వెళ్లాలని సీఎం అభ్యర్థిత్వం గురించి తర్వాత చర్చించుకుందామని ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందానికి కారణమైంది. ఇన్నాళ్లూ సీనియర్ నేతల్లో లోపించిన ఈ ఐకమత్యాన్ని కొన్ని రోజులుగా చూస్తున్నామని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఒక్కటైతే ఇక పార్టీకి తిరుగుండదని అంతా అనుకుంటున్నారు.