Marga Darsi Case : ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక తన ప్రత్యర్థులను వేధించడం మొదలుపెట్టారు. ఆయన తనకు అనుకూలంగా లేని ఏ ఒక్కరినీ వదిలి పెట్టడం లేదు. చంద్రబాబు నుంచి మొదలుకొని సామాన్య టీడీపీ కార్యకర్త వరకు అందరినీ వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇక తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించే వారిపై ఆయన దృష్టి పెట్టారు. వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఆయన దృష్టి ఈనాడు పేపర్ అధినేత రామోజీరావుపై పడింది. ఆయనకు ఆయువుపట్టులాంటి మార్గదర్శిపై ఏపీసీఐడీతో వరుసదాడులు చేయిస్తున్నారు.
అయితే ఇటీవల రామోజీరావు ఇంటికెళ్లి మరి సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. మార్గదర్శి లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ప్రచారం వెలుగులోకి తెచ్చారు. మరోవైపు కొందరు ఆడిటర్లను జైలుకు పంపించారు. ఆ తర్వాత వారికి న్యాయస్థానం ఉపశమనం కలిగించింది. ఇప్పటికే మార్గదర్శికి సంబంధించిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. అయితే శైలజపై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా, తెలంగాణ హైకోర్టును వాటిని తాజాగా రద్దు చేసింది.
మార్గదర్శి సంస్థల లావాదేవీలపై శైలజాకిరణ్ ను సీఐడీ ఇప్పటికే ప్రశ్నించింది. చందదారుల సొమ్ము ఎక్కడికి తరలించారనే కోణంలో సీఐడీ విచారణ కొనసాగుతున్నది. సంస్థకు చెందిన రూ. 793.50 కోట్ల ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. అయితే శైలజాకిరణ్ ను విచారించిన అనంతరం మరిన్ని ఆస్తులను అటాచ్ చేస్తారని టాక్ నడుస్తున్నది. అయితే మార్గదర్శి చిట్స్ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే తాజాగా శైలజాకిరణ్ విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. దానిని కోట్టివేస్తూ తీర్పు వెలువరించింది.