Undecided BJP : ఏపీలో రెండు ప్రధాన పార్టీల తో బీజేపీ ఢిల్లీ పెద్దలు తమ అవసరాల కోసం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీలో బీజేపీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అధికారి పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తకపోతే ఉన్న స్థితి నుంచి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత..
అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఈ సమయంలో మిన్నకుండి పోతే ప్రజల్లో చులకనైపోతామనే ఏపీ బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే కేంద్రంలో వైసీపీ కారణంగా తెరవెనుక దోస్తీ అంటూ ప్రచారం మొదలైంది.
వైసీపీ-బీజేపీ స్నేహం..
ఏపీలో వైసీపీ-బీజేపీ స్నేహం 2019లోనే మొదలైంది. 2014 తర్వాత తమతో స్నేహం చేసి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం పంచుకున్న చంద్రబాబు 2018 నాటికి తమను వీడి వెళ్లిపోయి ధర్మపోరాటం పేరుతో యుద్ధం ప్రకటించడంతో బీజేపీకి ఏపీలో నమ్మకమైన మిత్రుడు అవసరమయ్యాడు. దీంతో సహజంగానే విపక్షంలో ఉన్న వైసీపీకి మద్దతిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో పూర్తిస్దాయిలో కేంద్రం నుంచి జగన్ కు సహకారం లభించడం, అనుకున్నట్లుగానే భారీ మెజారిటీతో గెలిచిన జగన్ ను ఎన్డీయే దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య స్నేహం బయటికి చెప్పుకోకపోయినా ఓ రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. అందుకే ఏపీ బీజేపీ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు.
ఏపీలో జాతీయ నాయకులు పర్యటించాలని, ఈ ప్రాంతంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించేందుకు నిర్ణయించారు. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చెరో బహిరంగసభకు హాజరు కానున్నారు. హోంమంత్రి అమిత్ షా ఈ నెల 8న విశాఖపట్నం రానున్నారు. మోదీ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేళ్ల విజయాలపై బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. మరుసటి రెండు రోజులకు అంటే ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి బహిరంగసభకు హాజరుకానున్నారు.
టీడీపీవైపు చూపులు ?
ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ-బీజేపీ పొత్తు ప్రచారం ఎక్కువైందని, ఇదే పరిస్దితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనూ తమకు రిక్తహస్తం తప్పదనే భావన ఏపీ బీజేపీ నాయకుల్లో కనిపిస్తోంది. అయితే టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే కొంత మేర ప్రయోజనం ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కొందరు
భావిస్తున్నారు. మరో వారం రోజుల్లో బీజేపీ అగ్రనేతల పర్యటనల తర్వాత ఏం మార్పులు చోటుచేసుకుంటాయో చూడాల్సిందే..