Missing husband తనను ఇష్టంగా చూసుకునే భర్త, పదేళ్ల క్రితం దేశం కాని దేశంలో తప్పిపోయాడు. అతడి కోసం ఆ భార్య పడిన ఆరాటం మాములు విషయం కాదు. కానీ ఆ దేవుడు ఇప్పటికీ ఆ ఆడబిడ్డకు న్యాయం చేయలేదు. తన భర్త దొరికాడనుకొని ఇంటికి తెచ్చుకున్న మతిస్థిమితం లేని వ్యక్తి మరెవరో అని తెలిసి, ఆ మహిళ కన్నీటి రోదన ఎంతో మందిని కంటతడి పెట్టించింది.
ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో మతిస్థిమితం లేని వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించి ఇంటికి తీసుకొచ్చింది ఓ ఇల్లాలు. చివరకు తన భర్త కాదని కనిపెట్టి బాధ పడింది. యూపీలోని బలియా జిల్లాలో దేవ్ కలి గ్రామానికి చెందిన మోతీచంద్ వర్మకు 21 ఏండ్ల క్రితం జానకీదేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు కొడుకులు. పెండ్లయిన కొన్నాళ్లకు మోతీచంద్ మానసిక పరిస్థితి క్షీణించింది. వైద్యం కోసం బంధువులతో కలిసి నేపాల్ కు వెళ్లింది. అక్కడే మోతీ చంద్ తప్పిపోయాడు. భర్త కోసం జానకీ దేవి చేయని ప్రయత్నం లేదు. దేశం కాని దేశంలో కాళ్లరిగేలా తిరిగింది. కలిసిన వాళ్లందరినీ అడిగింది. కాళ్లావేళ్లా పడింది. అధికారులను వేడుకుంది. తన భర్త అచూకీ కనిపెట్టాలని ఎందరినో వేడుకుంది. దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేసింది.
అయితే ఈ క్రమంలో శనివారం ఒక వ్యక్తి బలియా జిల్లా దవాఖాన వద్ద మతిస్థిమితం లేకుండా కనిపించాడు. దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే తన భర్తలాగే కనిపించాడు. పాత దుస్తులు, పూర్తి గడ్డంతో ఉన్న వ్యక్తిని మోతీచంద్ గా భావించింది. వెంటనే తనతో కలిసి ఇంటికి తీసుకెళ్లింది. పిల్లలకు చూపించింది. కానీ మోతీ చంద్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి పుట్టమచ్చలు పరిశీలించగా, మోతీ చంద్ కాదని తెలిసిపోయింది. తన భర్త దొరికాడని పడిన ఆనందం నాలుగు గంటలైన ఆ మహిళకు మిగల్లేదు. ఇక వ్యక్తికి క్షమాపణలు చెప్పి ఇంటి నుంచి పంపించింది. తన భర్త కోసం ఆ తల్లి ఆరాటం చూసిన వారంతా దేవుడు కరుణిస్తు బాగుండని అనుకున్నారు.