ఎన్టీఆర్ అంటే నిలువెత్తు ఆత్మాభిమానం..
ఎన్టీఆర్ అంటే లీడర్, నెవర్ ఎ ఫాలోవర్ !
ఎన్టీఆర్ అంటే ఆత్మవిశ్వాసం..
వ్యక్తిగత జీవితం, సినీ జీవితం, రాజకీయ జీవితం ఏదీ వడ్డించిన విస్తరి కాదు. ఆయన వాటాన్నిటితో పోరాడి పాదాక్రాంతుల్ని చేసుకున్న విశ్వవిజేత. ఆయన ఎందరో కథానాయికలను పరిచయం చేశారు. పౌరాణిక ప్రతి నాయకులను హీరోలుగా చూపించి మెప్పించారు. హి ఈజ్ ఎ ట్రెండ్ సెట్టర్. రాయలసీమ సాగునీటికి, మద్రాసు నగర తాగునీటి అవసరాలకి తాపత్రయపడింది నందమూరి తారక రామారావే. ఆయన వారసుడుగా నటజీవితంలో అజరామరంగా వెలుగుతూ జూనియర్ ఎన్టీఆర్ గా ప్రసిద్ధుడైన హరికృష్ణ తనయుడికి తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించాలని లక్ష్మీపార్వతి మొదలుకొని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కొడాలి నాని తదితర అభిమానులు డిమాండ్ చేస్తూ పోస్టింగ్ పెడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించిందే. రాజకీయం తెలియని ఎన్టీఆర్ చేజారింది సైకిల్ గుర్తు. సినిమా బాగా ఆడకపోతే ఏ హీరో ఏడుస్తూ కూర్చోడు, కసితో రెట్టింపు పట్టుదలతో పెద్దహిట్ కొట్టే వరకు విశ్రమించడు. ఎన్టీఆర్ అన్న బ్రాండ్ ఇమేజ్ ముందు పార్టీల పేర్లు – ఎన్నికల గుర్తులు పిపీలకాలు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ తదనంతర రాజకీయ పరిణామాల్లో తన పేరిట “ఎన్టీఆర్ టీడీపీ” అంటూ మరో పార్టీ స్థాపించారు. దానికి సింహాం గుర్తు ఈసీ కేటాయించింది. ఎన్నికలకు ముందే ఎన్టీఆర్ హఠాన్మరణంతో లక్ష్మీపార్వతి ఆ పార్టీని నడిపారు. అలాగే ఆయన తదనంతర కాలంలో ఆయన కుమారుడు హరికృష్ణ సైతం “అన్న టీడీపీ” పేరుతో మరో రాజకీయ పార్టీని స్థాపించడం, గంట గుర్తుపై 1999 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయడం, ఆతర్వాత కాలంలో చంద్రబాబుతో చేతులు కలిపి టీడీపీకి చేరుకోవడం అందరికీ తెలిసిందే. తమిళనాట డిఎంకె ప్రభుత్వం – అన్నాదురై మరణానంతరం కరుణానిధి అధికారం చేపట్టారు. కరుణానిధితో విభేదించిన ఎంజీఆర్ “అన్నాడీఎంకే” పేరిట కొత్త పార్టీని స్థాపించి అధికారానికి తీసుకొచ్చారు. ఎంజీఆర్ మరణానంతరం ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ తో కొట్లాడి జయలలిత తాను నిలబడడమే గాక ఎంజీఆర్ పెట్టిన పార్టీని బతికించారు.
కాంగ్రెస్ చరిత్రను చూస్తే ‘కాడి జోడెడ్ల కాంగ్రెస్’, ‘ఆవు దూడ కాంగ్రెస్’ ఏమయ్యాయి..?
జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీపార్వతి, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, కేశినేని నాని తదితర ప్రముఖులు తెలుగుదేశం పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలు అంటున్నారు. వీరిలో లక్ష్మీపార్వతి, కొడాలి నాని, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పజెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న తెలుగుదేశం పార్టీ కోసం వీరంతా ఎందుకు తాపత్రయ పడుతున్నారు.. ? జూనియర్ ఎన్టీఆర్ కు తనపై తనకి నమ్మకం ఉంటే, తనలో ఇంకా చేవ బతికి ఉంటే తన తాత చివరి దశలో పెట్టిన “ఎన్టీఆర్ టీడీపీ” పార్టీకి ప్రాణం పోయచ్చు కదా, లేదంటే తన తండ్రి హరికృష్ణ పెట్టిన “అన్న టీడీపీ”కీ పునర్జీవం పోసే అవకాశం లేకపోలేదు. తాత, తండ్రి గతంలో స్థాపించిన ఏదో ఒక పార్టీని పున: ప్రారంభించడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏమిటో నిరూపించుకోవచ్చు కదా..! ఎవరో అనుభవించి అనుభవించి చీకిపడేసిన టెంక కోసం ఎందుకు వెంపర్లాట..? తెలుగుదేశం పార్టీని వదిలి నిద్రావస్థలో ఉన్న “ఎన్టీఆర్ తెలుగుదేశం” పార్టీ లేదా “అన్న టీడీపీ” లో ఒక దానికి ప్రాణం పోసి ఆ ఎన్టీఆర్ కి ఈ ఎన్టీఆర్ అసలైన వారసుడని నిరూపించుకోవాలి..!
జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించాలని పదేపదే డిమాండ్ చేస్తున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, లక్ష్మి పార్వతి, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులారా.. సీనియర్ ఎన్టీఆర్ ఎన్నడూ కక్కిన కూడుకి ఆశపడలేదు. నాదెండ్ల భాస్కర రావు ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యేల మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా, ఆయన మాత్రం సింహం మాదిరి 1985 లో మరోసారి ఎన్నికలకు వెళ్లడం, ప్రజలు ముఖ్యమంత్రిగా మరోసారి తిరిగి ఆశీర్వదించడం అందరికీ తెలిసిందే..! ఈ ఉదంతాల నుంచైనా స్పూర్తి పొంది ఆ దిశలో అడుగులు వేసి ఆయన వారసులం అని నిరూపించుకోండి.
వైసీపీ పెద్దలు పదేపదే రెండు ప్రకటనలు ఇస్తున్నారు; ఒకటి – తెలుగుదేశం, జనసేన కలిసి కాదు. వేరువేరుగా పోటీ చేయమని, రెండు – మా కుటుంబంలో కుంపటి రాజేయడానికి చంద్రబాబు, షర్మిలను ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి దింపారని ! రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు.. దమ్ముంటే మీరు చంద్రబాబు కి చెక్ పెట్టండి.. జూనియర్ ఎన్టీఆర్ ని ఒక పార్టీ నేతగా బరిలోకి దింపండి. శవం మీద మరమరాలు ఏరుకునే దుస్థితికి ఎన్టీఆర్ ని తీసుకురానివ్వకండి.. సింహం ఆకలైనా గడ్డి తినదు.
-తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు.