Fake Police : లగ్జరీ లైఫ్, గుర్రప్పందాలు, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ లకు అలవాటు పడిన ఓ వ్యక్తి వచ్చిన జీతం సరిపోక నకిలీ పోలీసు అవతారమెత్తాడు. హైదరాబాద్ పార్శిగుట్టకు చెందిన సన్నీ జాదవ్ ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజంట్ గా పని చేస్తున్నాడు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన సన్నీ జాదవ్ వచ్చే జీతం సరిపోకపోవడంతో పోలీసుని చెప్పుకుంటూ బ్లాక్ మెయిలింగ్ లకు దిగాడు.
స్టార్ హోటల్స్ లను అడ్డాలుగా చేసుకుని కాల్ గర్ల్స్ ను బుక్ చేసుకున్న కస్టమర్లను టార్గెట్ గా చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరిలో సికింద్రాబాద్ మారియట్ హోటల్ వద్ద ఒక కస్టమర్ ను బ్లాక్ మెయిల్ చేశాడు. తాను పోలీసునంటూ నకిలీ ఐడీ కార్డు చూపించి న్యూడ్ వీడియోస్ పబ్లిక్ చేస్తానని రూ.5 లక్షలు, 2 తులల బంగారు గొలుసు తీసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ ద్వారా బెదిరించి మళ్లీ రూ.5 లక్షలు వసూలు చేశాడు.
దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు సన్నీ జాదవ్ ను అదుపులోకి తీసుకొని రూ.3 లక్షల నగదు, టూ వీలర్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2017లో మాదాపూర్ పీఎస్ లో కూడా సన్నీ జాదవ్ పై కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో తెలిసింది.