Indian Painted Frog : తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడంపూర్ రేంజ్ పరిధిలోని పెద్దవాగు పరిసరాల్లో మంగళవారం అటవీ అధికారులు అరుదైన జాతి రకం కప్పను గుర్తించారు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో కల్లెడ డీఆర్వో ప్రకాష్, ఎఫ్బీవో ప్రసాద్ లు గస్తీ తిరుగుతుండగా ఈ కప్ప కనిపించడంతో ఫొటోలు తీశారు.
ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్, శ్రీలంక బుల్ ఫ్రాగ్ పేర్లతో పిలిచే ఈ కప్ప చాలా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుందని డీఆర్వో ప్రకాష్ తెలిపారు. ఈ కప్పలు వేసవిలో చల్లని ప్రదేశాల్లో నేల లోపలి భాగంలో ఉండి, వర్షాకాలం ఆరంభంతో బయటకు వచ్చి గుడ్లు పెడతాయన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, జీవవైవిధ్యం ఉన్నచోటనే ఇవి జీవిస్తాయని వెల్లడించారు. మొదటిసారి కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఈ కప్ప కనిపించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.