![AP CEO](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-18-2.jpg)
AP CEO : ఏపీ సీఎం చంద్రబాబుకు ముందు నుంచి టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. దాదాపు పాతికేళ్ల క్రితమే రాబోయే టెక్నాలజీని ఊహించి హైదరాబాద్ లో హైటెక్ సిటీకి అంకురార్పణ చేశారు. తాను చేసిన ఈ పనితో సాఫ్ట్ వేర్ రంగం హైదరాబాద్ లో కొత్త పుంతలు తొక్కతుంది. మహా నగరాలను దాటేసి హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగం ఎదుగుతున్నది.
తాజాగా ఆయన లింక్డ్ ఇన్ ఖాతాపై ఇంటర్నెట్ లో నెటిజన్లు చర్చ పెట్టారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో ఆయన బయోను అప్డేట్ చేశారు. బిజినెస్, ఎంప్లాయిమెంట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్డ్ ఇన్లోలో ఆయన చేసిన ఓ పోస్టు ఎక్స్(ట్విట్టర్) లో వైరల్ గా మారింది. దీనిపై ఇప్పుడు చర్చ జోరుగా సాగుతున్నది. టెక్నాలజీ వినియోగంలో, ప్రోత్సహించడంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడి సృష్టించే చంద్రబాబు ఈసారి కూడా తన పోస్టును అదే రీతిలో అప్ డేట్ చేశారు.
ప్రొఫైల్పై చర్చ..
సీఎం చంద్రబాబు నాయకుడు జూన్ 12న ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలను వెంటనే అప్ డేట్ చేశారు. అనంతరం లింక్డ్ ఇన్లో ఓ పోస్టు షేర్ చేశారు. ‘ఇటీవల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, బీజేపీ. జనసేన కూటమి 164 స్థానాలు సాధించిందని, ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని తన పోస్టులో పేర్కొన్నారు. మూడు పార్టీల కూటమిలో ప్రజలు నాలుగో పార్టీగా చేరారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తాం’ అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఎక్స్లో షేర్ చేసిన మహిళ..
చంద్రబాబు లింక్డ్ ఇన్లో రాసుకున్న పోస్టును రాధికా ధని అనే ఓ మహిళ ఎక్స్లో పోస్టు చేశారు. చంద్రబాబు తన ప్రొఫైల్ నెట్వర్కింగ్ చేస్తున్నట్లు లేదని, తన రెస్యూమ్ అప్డేట్ చేసినట్లు ఉందని రాశారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది టెకీలు ఈ విషయంపై స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు 1995 నుంచి హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని.. ఆయన్ను ఏపీ సీఎం అని కాకుండా సీఈవో అని పిలుచుకుంటారని పలువురు టెకీలు కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబుకు వచ్చిన అవార్డులు, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికల్లో వచ్చిన కవరేజ్ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ పోస్ట్ 2.70 లక్షల మంది వీక్షించారు.
వినియోగం తక్కువే..
పొలిటికల్ లీడర్లు ఎక్కువగా ఎక్స్ ఫేస్బుక్, ఇన్స్టా వంటివి వినియోగిస్తుంటారు. లింక్డ్ ఇన్ లాంటి ప్రొఫెషనల్ వేదికలు ఉపయోగించడం చాలా అరుదు. బిజినెస్ ప్రొఫెషనల్స్, టెక్ సంబంధిత వ్యక్తులు మాత్రమే లింక్డ్ ఇన్లో ఖాతాలు కలిగి ఉంటారు. ఉద్యోగార్థులు ఎక్కువగా లింక్ డ్ ఇన్ ను వాడుతుంటారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యేవారు. విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సులు సైతం ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది బిజినెస్ ప్రొఫెషనల్స్తో కనెక్ట్ కావడానికి ఆయన లింక్డ్ ఇన్ వాడుతున్నారు.