![Palagummi Padmaraju](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/Gali-vana.jpg)
Palagummi Padmaraju : ప్రముఖ తెలుగు రచయిత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి గెలుపొందిన “గాలివాన” కథారచయిత అయిన పాలగుమ్మి పద్మరాజు జన్మదినాన్ని చరిత్రలో జూన్ 24వ తేదీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, హేతువాది, ఎం.ఎన్.రాయ్ భావ ప్రచారకుడూ అయిన పాలగుమ్మి తన జీవితకాలమంతా రచనలతోనే జీవనం సాగించారు.
పద్మరాజు 23 ఏళ్ల వయస్సులో తన మొదటి కథ “సుబ్బి”ని రచించారు. ఈయన ఎన్నో కథలు రాసినప్పటికీ వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన కథ “గాలివాన” మాత్రమే. ఈ కథ 1952వ సంవత్సరంలో న్యూయార్క్లోని “హెరాల్డ్ ట్రిబ్యూన్”వారు నిర్వహించిన ప్రపంచ కథల పోటీలలో రెండువ బహుమతిని గెలుచుకుంది.
పాలగుమ్మి పద్మరాజు తన సాహిత్య జీవనయానంలో 60 కథలు, ఎనిమిది నవలలు, 30 కవితలు… ఇంకా లెక్కలేనన్ని నాటికలు మరియు నాటకాలను రచించారు. ఈయన రాసిన 60 కథలలో గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి.
“గాలివాన”తో ప్రపంచ ఖ్యాతి తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజుకే చెందుతుంది. ఈ కథను ప్రపంచంలోని అనేక బాషలలోకి అనువదించారంటే ఆ నవల సాహితీ ప్రపంచంలో ఎంతగా పేరుతెచ్చుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
పాలగుమ్మి నవల “నల్లరేగడి”ని “మాఊరి కథ” అనే పేరుతోనూ, “పడవ ప్రయాణం” అనే కథను “స్త్రీ” పేరుతోనూ సినిమాలుగా తీశారు. అదలా ఉంచితే, దర్శకుడు దాసరి నారాయణరావు సినిమాలకు చాలా వాటికి పాలగుమ్మి ఘోస్ట్ రైటర్గా కూడా పనిచేసినట్లు అప్పట్లో చెప్పుకునేవారు అట. సాహితీ వినీలాకాశంలో ఓ వెలుగువెలిగిన అచ్చ తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు 1983లో తుదిశ్వాస విడిచి, ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు…