![Ladakh](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-18.jpg)
Sudden Floods : చైనా సరిహద్దు లద్దాఖ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లేహ్ కు 148 కి.మీ. దూరంలోని బోధి నదిలో శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సైనిక విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో ఉధృతి పెరిగి టీ-72 ట్యాంక్ మునిగిపోయింది. అందులోని ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. జవాన్ల కోసం నదిలో గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.
దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.