AP Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. తొలుత అప్పుడు ప్రకటించిన విధంగా మెగా డీఎస్సీ ఫైలు పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. తర్వాత పెంచిన సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సామాజిక పింఛన్ల పంపిణీ పై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో ప్రభుత్వం మారడంతో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఎలా ఉంటుందోనన్న అనుమానాలు లబ్ధిదారుల్లో నెలకొన్నాయి. వాలంటీర్ల ద్వారా అందిస్తారా? సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తారా? నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారా? అన్న అనుమానాలు వారిలో ఉన్నాయి. కానీ సచివాలయ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. సామాజిక పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య,వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తి వారు, ట్రాన్స్ జెండర్లు, ఏ ఆర్ టీ, ఆర్టిస్టులకు రూ.3000 నుంచి రూ.4 వేలకు పింఛన్ పెరిగింది. దివ్యాంగులు, కుష్టు రోగులకు ఇప్పుడున్న రూ.3000 నుంచి రూ.ఆరు వేలకు పెంచారు. పూర్తి వైకల్యం ఉన్నవారికి 5000 నుంచి రూ.15 వేలకు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారు, డయాలసిస్ రోగులు తదితరులకు రూ.5000 నుంచి రూ.10000 కు పెంచారు.
జూలై 1న మొదటి రోజు లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రతి సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన 50 మందికి పింఛన్ అందించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తం అందించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని.. జూలై నెల 4000 తో కలిపి మరో మూడు వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నెలలో 7000 అందిస్తారు. వచ్చే నెల నుంచి రూ.4000 అందించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు అందించేవారు. ఇప్పుడు సచివాలయ సిబ్బందితో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక హెచ్ఐవీ బాధితులకు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగులకు దివ్యాంగ బ్యాంక్ ఖాతాలో నగదు మొత్తాన్ని జమ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై రెండు నాటికి పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయం తెలిసిన లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.