Bhuvaneshwari Enters : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు యువనేత నారాలోకేశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తండ్రితో పాటు తనపై పెట్టిన కేసులపై పోరాడుతున్నారు. ఇక టీడీపీ శ్రేణులను మేం అండగా ఉన్నామని చెప్పేందుకు ఇప్పుడు అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారంటూ నిజం గెలవాలి అనే క్యాప్షన్ తో ఆమె జనాల్లోకి వెళ్తున్నారు.
అయితే అన్న ఎన్టీఆర్ బిడ్డగా భువనేశ్వరి రాజకీయాల్లో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరు. ఆమె భర్త చంద్రబాబు 40 ఏండ్లు రాజకీయ జీవితంలో ఉన్నా, 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఏనాడూ రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు. ఇక ఇప్పుడు భర్త అరెస్ట్ తర్వాత మనోవేదనతో ఆమె బయటకు రావాల్సి న ఆవశ్యకత ఏర్పడింది. ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నారావారిపల్లెలో గ్రామదేవతలకు పూజలు చేయనున్నారు. నారా చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మల సమాధుల వద్ద నివాళులర్పించనున్నారు.
ఇక ప్రస్తుతం వారంలో మూడు రోజులు ఈ యాత్ర కొనసాగనున్నది. ముందుగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటన ఖరారైంది. మహిళలను పెద్ద ఎత్తున సమీకరించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ క్రమంలో నారా భువనేశ్వరి భావోద్వేగంతో ట్వీట్ చేశారు. చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని, ఈ ప్రయాణం భారంగా ఉందంటూ ట్వీట్ చేశారు. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు.
ఎప్పుడూ కుటుంబ సభ్యులతో నారావారి పల్లెకు వచ్చే నేను ఈ రోజు ఒంటరిగా వచ్చాను అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈమె చేపట్టే యాత్ర టీడీపీ కి మైలేజ్ తేవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పాటు ఆయా కుటుంబాలకు భరోసానిచ్చేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పదని అభిప్రాయపడ్డారు.