Chandra babu : గతంలో ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సతీమణి గురించి వైసీపీ నేతలు ప్రస్తావించడంతో ఆయన సభ నుంచి వెళ్లిపోయి మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రెస్మీట్లోనే వెక్కి, వెక్కి ఏడ్చారు.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఆయనను ఓదార్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానిస్తున్నారని చంద్రబాబు భావోద్యేగానికి గురయ్యారు. తన భార్య భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదన్నారు. క్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోస, ప్రజల కోసం ఎంతో ఓర్పుగా ఉన్నానన్నారు.
తన జీవితంలో ఎప్పుడూ ఇంత బాధ భరించలేదన్నారు.. ఇలాంటి పరిణామాలు చూడలేదన్నారు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురి చేసినా భరించానన్నారు. అధికారంలో తాను ఎవర్నీ కించపరచలేదని.. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగిందని.. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించానన్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. అయితే తాజాగా ఆ సంఘటనను సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో గుర్తుచేశారు. గతంలో తనపై బాంబు దాడి జరిగినా కూడా కన్నీళ్లు పెట్టుకోలేదని.. కానీ రాజకీయాలతో సంబంధం లేని తన భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానించారన్నారు. తన సతీమణినే కాకుండా రాష్ట్రంలో ఆడబిడ్డలందరిని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడరని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. ఆడబిడ్డల గురించి అలా మాట్లాడినందుకే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.