CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజా సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ సారి ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేసి సీఎం కుర్చీలో కూర్చున్న చంద్రబాబు నాయుడు.. ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతున్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చేసి.. అర్హులైన అందరికీ చేరువయ్యేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో రెండు పథకాల పేర్లను మార్చారు సీఎం.
గత ప్రభుత్వం ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’ పేరు పెడితే అదే పథకాన్ని ‘చంద్రన్న పెళ్లి కానుక’ పేరుతో తీసుకువచ్చారు. మైనార్టీల కోసం వైసీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం పేరును ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనారిటీస్’గా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు.
వైసీపీ ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’తో ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించారు. అయితే రీసెంట్ గా అధికారం లోకి బాబు సర్కార్.. ఇదే పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా అమలు చేయాలని భావించింది.
గత ప్రభుత్వం ఈ పథకం కింద.. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష ఇవ్వగా.. ఎస్టీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు ఇచ్చింది. బీసీలకు రూ.50 వేలు, కులాంతరం అయితే రూ.75వేలు అందజేశారు. మైనార్టీలకు రూ. లక్ష దివ్యాంగులకు రూ.1.50 లక్షలు ఇచ్చారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వబోతున్న ‘చంద్రన్న పెళ్లి కానుక’ కింద ఎంత ఇస్తారనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే అందజేస్తారని మాత్రం తెలుస్తోంది. ఈ మేరకు సంబంధించిన మార్గ దర్శకాలు విడుదల చేయనున్నారట.
ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే.. పెళ్లి నాటికి వరుడి వయస్సు 21 సంవత్సరాలు, వధువు వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇద్దరు కూడా పదో తరగతి చదివి ఉండాలి. మొదటి పెళ్లికి మాత్రమే ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం అందుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు అర్హులుగా ఈ పథకం గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది. కొత్త ప్రభుత్వం నిబంధనల్లో ఎలాంటి సడలింపులు చేస్తుందనేది వేచి చూడాలి.