CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ బాధితురాలు ఆరుద్రకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆమెకు చెప్పినట్లుగానే రూ.5 లక్షల చెక్కును అందజేశారు. సచివాలయంలో అధికారులు తనకు రూ.5 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఆరుద్ర కుమార్తెకు నెలకు రూ.10 వేల సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ అన్నవరం, అమలాపురం, కాకినాడలలో తమను ఇబ్బంది పెట్టినవారిపై కేసును నమోదు చేయాలని, పోలీసుల మీద ప్రత్యేక కమిషన్ వేసి తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కోర్టు కేసులు కొట్టించి తమ ఆస్తి తమకు ఇప్పించాలని, ఈ పరిస్థితి తీసుకొచ్చిన వారిపై, తాము అప్పుల పాలవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆరుద్ర కుమార్తె లక్ష్మితో కలిసి ఈ నెల 14న అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. ఆరుద్ర కుమార్తెకు రూ.10 వేల పింఛనుతో పాటుగా వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆరుద్ర ఆస్తి వివాదాలు పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముందు వరకు ఆరుద్ర తన కుమార్తెతో కలిసి వారణాసిలో ఉన్నారు. ఆ తర్వాత ఏపీకి తిరిగొచ్చి చంద్రబాబును కలిశారు.