Modi Praise of Araku Coffee : దాదాపు నాలుగు నెలల తర్వాత ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో పాల్గొన్నారు. మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మన్కీ బాత్లో నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను మోడీ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆయన అరకు కాఫీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఆంధ్రప్రదేశ్కు చెందిన అరకు కాఫీ చాలా ప్రత్యేకతమైంది.. మిత్రులారా.. భారత్లోని చాలా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దేశానికి చెందిన ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం చూసినప్పుడు, గర్వంగా అనిపించడం సహజం.. అలాంటి ఉత్పత్తుల్లో అరకు కాఫీ కూడా ఒకటి.’’ అంటూ మోడీ ప్రశంసించారు.
తర్వాత ఆయన 2016లో సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ తాగిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. అరకు కాఫీ సాగులో గిరిజనుల సాధికారతకు విడదీయలేని అనుబంధం ఉంది అని మోడీ పేర్కొన్నారు. ఈ ట్వీట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ… మరోసారి మీతో కలిసి కాఫీ తాగడానికి ఎదురు చూస్తున్నట్లు మోడీ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని ట్వీట్ లో రాసుకొచ్చారు. గిరిజన సాధికారత, ఆవిష్కరణల సమ్మేళనాన్ని సూచిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ప్రతిబింబం అని చంద్రబాబు స్పష్టం చేశారు. దీన్ని గుర్తించి మేడిన్ ఆంధ్ర ఉత్పత్తిని ఆమోదించినందుకు ప్రధాని మోడీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఇక, మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తీసుకుని వచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 25న జరిగిన చివరి ఎపిసోడ్ నుంచి మిమ్మల్ని కలవడం కుదరలేదని, ఎన్నికల ప్రక్రియ కారణంగా మీతో కమ్యూనికేషన్ ఆగిపోయిందని మోడీ అన్నారు. ఫిబ్రవరి నుంచి మనమంతా ఎదురు చూస్తున్న ఆ రోజు నేడు వచ్చిందన్నారు. మన్ కీ బాత్ ద్వారా మరోసారి నా కుటుంబ సభ్యుల మధ్య నేను ఉండగలిగాను. ఎన్నికల ఫలితాల తర్వాతనే నేను మళ్లీ మిమ్మల్ని కలుస్తానని ఫిబ్రవరిలోనే మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.