Rythu Bandhu : గత ప్రభుత్వం (బీఆర్ఎస్)లో వచ్చిన గొప్ప పథకం ‘రైతు బంధు’. ఈ పథకం ఎంతలా ప్రాచుర్యం పొందిందంటే.. దీని నుంచి స్ఫూర్తి పొందిన కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ సమ్మాన్ యోజన’ కింద ఏటా రూ. 6వేలు అందించింది. అయితే రైతు బంధు మాత్రం ఏటా ఎకరాకు రూ. 12 వేలు అందించేది. అయితే రైతు బంధుతో చిన్న సన్నకారు రైతలే కాకుండా పెద్ పెద్ద భూస్వాములు (వందల ఎకరాలు ఉన్నవారు) కూడా లబ్ధి పొందేవారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యేది.
అయితే, దీనిపై రేవంత్ ప్రభుత్వం సీలింగ్ విధించాలని అనుకుంటుంది. మెజారిటీ రైతులు కూడా అదే కోరుకుంటున్నారట. రైతు బంధు సీలింగ్ విధిస్తే అర్హులైన రైతులకు రైతు బంధు ఫలాలు దక్కుతాయి. ‘దీనిపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చిస్తాం. రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం. ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తాం’ అంటూ ఇటీవల సీఎం అన్నారు. అయితే ఫిబ్రవరి నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో విపక్షాలతో సైతం చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) 2018 ఎన్నికల సమయంలో ‘రైతు బంధు’ ప్రవేశపెట్టింది. సాగుభూమి ఉన్నవారిని అర్హులుగా ప్రకటించింది. పేద, సన్న, చిన్నకారు రైతులతో పాటు వందల ఎకరాలున్న భూస్వాములు, రియల్ వ్యాపారులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, కోట్లల్లో ట్యాక్స్ కట్టేవారు, సంపన్నులకు కూడా ఫలాలు అందించింది. సంపన్నులు, ప్రభుత్వ అధికారులకు రైతు బంధు ఇవ్వడాన్ని రైతులు తప్పబట్టారు. వారి స్థానంలో కౌలు రైతులకు ఇవ్వాలని సీపీఐ, బీజేపీ నేతలు సైతం ప్రభుత్వాన్ని కోరారు. సాగు చేయని వారికి సాయం ఎందుకుని ప్రశ్నించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం వెనక్కు తగ్గలేదు. విమర్శలు, నిరసనల నేపథ్యంలో ఎన్నికల తర్వాత సీలింగ్ గురించి ఆలోచిస్తామని స్వయానా పార్టీ వర్కింగ్ పెసిడెంట్ చెప్పారు.
ప్రజాధనాన్ని కాపాడేలా
రేవంత్ గద్దెనెక్కిన తర్వాత గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలలో లోపాలను సవరిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు అప్పుల భారం ఎక్కువ ఉందని దుబారాను తగ్గిస్తున్నారు. ఈ మేరకు అధికారులను కూడా దుబారా చేయవద్దని ఆదేశించారు. ప్రజాధనం ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కానివ్వబోమని చెప్పారు. ‘ప్రజా పాలన’ను గురువారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్ లో రేవంత్ ను విలేకరులు రైతు బంధు సీలింగ్ పై ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ..
‘రైతు బంధు’ సీలింగ్ పై అనేక మంది రిక్వెస్టులు, ప్రతిపాదనలు చేస్తున్నారని అసెంబ్లీ బడ్జెస్ సెషన్ లో చర్చించి అందరి అభిప్రాయం మేరకు ఒక నిర్ణయానికి వస్తానని’ చెప్పారు. గరిష్ఠంగా ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలనే దానిపై కూడా అభిప్రాయం సేకరిస్తున్నామన్నాని, అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే జూన్-జూలై పంట వరకు రైతు బంధును రైతు భరోసా పేరుతో లబ్ధిదారులకు అందించనున్నారు.