MLA Raghunandan :
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు బుధవారం (జూలై 5వ తేదీ)న అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు బయలుదేరిన ఆయనను హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రెండు, మూడు రోజులుగా గజ్వేల్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసిన ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అక్కడికి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. విగ్రహం వద్ద ఒక వర్గానికి చెందిన వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. దీంతో హిందూ సంఘాల యువకులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు కొనసాగుతున్నాయి.
అయితే, ఈ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ధర్నా చేసి, ర్యాలీ నిర్వహిస్తుండగా వారి ర్యాలీపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడతే.. మరొకరు తప్పించుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో హిందూ సంఘాలు ఆందోళనలను మరింత పెంచాయి. దీంతో నిన్న (జూలై 4వ తేదీ) గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చాయి హిందూ సంఘాలు. బంద్ కూడా సీరియస్ గా సాగింది. ఈ నేపథ్యంలో గజ్వేల్ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక బలగాలను తీసుకువచ్చి బందోబస్తు నిర్వహించారు.
గాయాలపాలైన బాధితులను పరామర్శించేందుకు వస్తున్న రఘునందన్ రావు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వస్తున్న తరుణంలో మరిన్ని దాడులు జరుగవచ్చనే అనుమానంతో ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రఘునందన్ రావు అరెస్ట్ ను పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రఘునందన్ తో ఈటల ఫోన్ లో మాట్లాడారు. నిర్బంధాలను ఖండిస్తున్నామన్నారు. బేషరతుగా రఘునందన్ రావును విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.