Janasena Symbol : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్. ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ కూటమికి భారీ విజయాన్ని అందించారు.
పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఆయన ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఎంచుకున్నారు. ఈ విజయంతో జనసేనకు పార్టీ గుర్తు విషయంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తుగా ‘గాజు టీ గ్లాసు’ ఎంచుకుంది. గత సారి పార్టీకి తగిన ఓట్ల శాతం రాకపోవడం, అసెంబ్లీ లేదా పార్లమెంట్లో పార్టీ తరఫున ఎవరూ ప్రాతినిధ్యం వహించనందున తాత్కాలికంగా ఇదే గుర్తుకు కేటాయించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2024 ఎన్నికల్లో జనసేన తరుఫున స్వతంత్ర అభ్యర్థులుగా గాజు టీ గ్లాస్ గుర్తును కేటాయించింది పార్టీ. ఈసారి 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన విజయం సాధించింది.
ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. కనీసం 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉంటే మాత్రమే ఆ పార్టీకి శాశ్వత గుర్తును కేటాయిస్తారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీకి 6 శాతం ఓట్లు రావాలి. ప్రస్తుత ఎన్నికలతో ఆ సమస్య తీరింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల్లోని అన్ని బాక్సులను ఫిల్ చేసింది జనసేన పార్టీ. దీంతో పార్టీకి అదే గుర్తు శాశ్వతంగా ఉండబోతోంది.
దీనిపై ఎన్నికల సంఘం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా పార్టీ క్యాడర్కు ఉపశమనం, సంతృప్తిని కలిగించే శుభవార్త అవుతుంది.