Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో ఈసారి కూడా ఊరట లభించలేదు. ఆమె బెయిల్పై ఈడీ, సీబీఐ వాదనలు ముగిశాయి. సోమవారం ఎమ్మెల్సీ కవిత తరపున వాదనలు ముగిశాయి. వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్పై తీర్పును రిజర్వ్ చేశారు.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ, సీబీఐ తమ వాదనలు వినిపించాయి. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు లేకుండా చేసే అవకాశం ఉందని వాదించాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అక్రమ డబ్బు నేరుగా కవితకు చేరిందని ఈడీ తన వాదనలు వినిపించింది. ఈ కేసులో కవిత కీలక పాత్రధారి అని.. ఇందుకు సంబంధించి వాట్సాప్ చాట్, ఇతర ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించింది.
కవిత తరపు వాదనలు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బుచ్చిబాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయని కవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు వినిపించారు. బుచ్చి బాబు స్టేట్మెంట్లు కోర్టు పట్టించుకోవద్దని.. ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్ష్యాలు ఈడీ చూపించలేదని ఆయన వివరించారు. సాక్ష్యాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత తన మొబైల్ ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని.. రూ. 190 కోట్ల అక్రమ డబ్బు చేరిందన్న ఈడీ వాదనల్లో వాస్తవం లేదని, ఒక్క పైసా కూడా కవిత ఖాతాకు చేరలేదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి సాక్ష్యాలు ఈడీ చూపలేదని తెలిపారు. కవిత అరెస్ట్ విషయంలో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదని.. అరెస్ట్కు సీబీఐ సరైన కారణాలు చెప్పలేదని కవిత న్యాయవాది వివరించారు.
ఈడీ వాదనలు ఇవే..
లిక్కర్ స్కాంలో కవిత కింగ్ పిన్ అని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ తన వాదనలు వినిపించారు. ‘‘లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరిందన్నారు. ఇందుకు సంబంధించిన వాట్సప్ చాట్స్ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘ఇండియా ఏహెడ్” టీవీ ఛానల్ లో పెట్టుబడి పెట్టారని, ఫోన్లో డేటాను ధ్వంసం చేశారని కోర్టుకు వివరించారు. విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈడీకి ఇచ్చిన ఫోన్ల డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. డిజిటల్ డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానాలు ఇచ్చారని, ఎమ్మెల్సీకి బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. సూర్యాస్తమయానికి ముందే ఆమెను అరెస్టు చేశామని, ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదని. గోప్యత హక్కును భంగపరచలేదని అని ఈడీ స్పష్టం చేసింది.
సీబీఐ వాదనలు ఇలా..
మద్యం పాలసీపై కవితను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ వ్యాపారికి చెప్పారు. భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా అయ్యింది. ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు కూడా ఉన్నాయి. అందుకే కవితను అరెస్టు చేశాం. మహిళ అయినంత మాత్రాన బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదు. ఈ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితనే ప్రధాన లబ్ధిదారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలు లేకుండా చేస్తుంది. సాక్షులను సైతం ప్రభావితం చేస్తుంది. ఎమ్మెల్సీ కవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని, సీబీఐ కేసులో బుచ్చిబాబును అరెస్టు చేసి, చార్జిషీట్ కూడా దాఖలు చేశామని సీబీఐ తన వాదనలు వినిపించింది.