liquor scandal : మద్యం కేసులో సమాధానం చెప్పకుండా మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఇసుక కుంభకోణం అంటూ భవన నిర్మాణ కార్మికులను 40 లక్షల మందిని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ అధికారం చెలాయిస్తున్నారు జగన్. ఇంతవరకు కేంద్ర నిధులను పక్కదారి పట్టించి తన పబ్బం గడుపుకుంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిజాలను నిగ్గుతేలుస్తామన్నారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇసుక కుంభకోణం అంటూ చంద్రబాబును బాధ్యులుగా చేస్తూ తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టు అక్రమమని మొదట చెప్పింది బీజేపీనే. కానీ మా పార్టీపైనే బురద జల్లుతున్నారు. బాబు అరెస్టులో మా పాత్ర ఉందని అబద్దాలు ఆడుతున్నారు. నిధుల వాడకంలో కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ మాయాజాలం చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతూ పోతుంటే చివరకు జగన్ కు ఏ గతి పడుతుందో చూడాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం. రేపు జగన్ కూడా ప్రతిపక్షంలోకి వస్తే జైలుకు పంపితే ఏం చేస్తాడో చూడాలని ఎద్దేవా చేశారు. సైకో పాలనకు స్వస్తి పలికి మంచి పాలన అందించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.