![Amul Dairies](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/amul.jpg)
Amul Dairies : జగన్ సీఎంగా ఉన్నప్పుడు పాలవెల్లువ పేరుతో హెరిటేజ్, ఇతర సహకార డెయిరీలను దెబ్బకొట్టాలని అమూల్ డెయిరీలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వైసీపీ సర్కారు అన్ని విధాలా అమూల్కు మేలు చేకూర్చినా పాలసేకరణలో మాత్రం ముందుకు వెళ్లలేకపోయింది. రైతులు ఆసక్తి చూపకపోవడం, కేంద్రాల నిర్వహణకు సొమ్ముల్లేక ఇప్పటికే దాదాపు 55 కేంద్రాలు మూతపడ్డాయి. గతంలో రోజుకు 50 వేల లీటర్లు పాలు రాగా ప్రస్తుతం 37,600 లీటర్లు మాత్రమే వస్తున్నాయి. వీటి వల్ల పాడి రైతులకు కూడిన ప్రయోజనం మాత్రం శూన్యమే.
అమూల్ డెయిరీపై జగన్ సర్కార్ అంతులేని ప్రేమ చూపింది. ఆ సంస్థ ఏం కోరినా యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేసింది. పాడి రైతులను ఒక్కటి చేసి పాలసేకరణకు వసతిని కల్పించడం వరకూ అన్నీ ప్రభుత్వమే దగ్గరుండి చూసుకుంది. నెలనెలా పాలసేకరణ పెంచేలా అధికారులపై ఒత్తిడి కూడా తెచ్చింది. ఇంత చేసినా పాల సేకరణలో సహకార, ప్రైవేటు డెయిరీలను తట్టుకుని నిలబడలేకపోతోంది. అనకాపల్లి జిల్లాలో 305 పాలసేకరణ కేంద్రాలు ప్రారంభించగా అందులో 55 కేంద్రాలు మూతపడ్డాయి. పాలు పోయడానికి రైతులు ముందుకు రాకపోవడంతో మరో 29 కేంద్రాలు తలుపులే తెరుచుకోలేదు. కొన్నిచోట్ల పంచాయతీ భవనాల్లో పాల కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వాటి నిర్వహణ ఖర్చులు అమూల్ భరించాల్సి వస్తోంది. అయితే ఆ భారం పంచాయతీల నెత్తినే వేస్తున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమూల్ వచ్చాక గతంలో విశాఖ డెయిరీ నుంచి రైతులకు అదనంగా అందించే బోనస్లు, ప్రోత్సాహకాలను నిలిపి వేశారని పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు.
నక్కపల్లి, అనకాపల్లి మండలాల్లోని సీహెచ్ఎల్పురం, మార్టూరు పంచాయతీ కార్యాలయాల్లో అమూల్ డెయిరీలు రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల వల్ల పంచాయతీకి ఎలాంటి ఆదాయం లేకపోగా వాటి నిర్వహణ ఖర్చుల భారం పెరిగిపోయింది. కొన్ని చోట్ల భారీగా విద్యుత్ బకాయిలు పేరుకు పోయాయి. ఆ కంపెనీ వాటిని చెల్లించడం లేదు. రైతులకు సహకార బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి ఆర్భాంటగా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇతర డెయిరీలు పాలు పోసే రైతుల పిల్లలకు విద్య, వారి కుటుంబాలకు వైద్యం, పాడి పశువులకు దాణా రాయితీపై అందిస్తున్నాయి. పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. అమూల్ సంస్థ ఇవేవీ అమలు చేయకపోవడంతో క్రమంగా ఆ సంస్థకు పాలు పోసేందుకు గ్రామాలలో అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఒక్కో కేంద్రం మూతపడుతూ వస్తోంది.