Karnataka result tomorrow : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మొత్తం 224 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 113 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే ఫలితాలపై ఇప్పటికే అన్ని పార్టీలు తమదంటే తమదే విజయమని ప్రకటిస్తున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో సీట్లు తగ్గితే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే విషయమై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మంతనాలు జరుపుతున్నాయి. మెజార్టీ రాకపోతే జేడీఎస్ ఇక్కడ కీలకం మారనుంది.
జేడీఎస్ ఎమ్మెల్యేలపై ఆ రెండు పార్టీల కన్ను..
ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకున్నాయని సమాచారం. జేడీఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయం కాక పుట్టిస్తున్నది. రేపు తేలే ఫలితంతో ప్రజలు ఎవరి వైపు మొగ్గారో తేలనుంది. అయితే ప్రస్తుతం జేడీఎస్ నేత కుమారస్వామి సింగాపూర్లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచే బీజేపీ తో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఫలితాల సమయంలో అక్కడికి వెళ్లడం అనుమాలకు తావిస్తున్నదని వారు భావిస్తుండగా, హాలిడే కోసమే వెళ్లారని జేడీఎస్ చెబుతున్నది.
ఈ నేపథ్యంలో సంపూర్ణ సర్కారు అధికారంలోకి వస్తుందా.. లేక హంగ్ కు ప్రజల తీర్పు అద్దం పట్టిందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. జేడీఎస్ కు 20 నుంచి 30 సీట్లు వస్తే కింగ్ మేకర్ గా నిలవనుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ ఫలితాలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. తమకు అత్యధిక సీట్లు వస్తాయని గట్టిగా చెబుతున్న కాంగ్రెస్ మాత్రం, కేంద్రంలోని బీజేపీ మైండ్ గేమ్ ఆడితే ఎలా ఎదుర్కోవాలో చర్చలు చేస్తున్నది . కర్ణాటక ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ రాష్ర్టంలో పరిస్థితులను అంచనా వేస్తూ, పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
అధిష్టానం, సిద్ధరామయ్య, పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడూ టచ్ లో ఉంటూ రేపటి ఫలితాలపై చర్చిస్తున్నారు. క్యాంపు రాజకీయాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మరో వైపు విజేతలపై బెట్టింగ్ కూడా కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 11 గంటలకల్లా ట్రెండింగ్ తెలిసిపోనుంది. అయితే 2 నుంచి 4 సీట్లు వస్తాయని భావిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి పార్టీ సిద్ధరామయ్య కు మద్దతునిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇక 24 గంటల్లో కర్ణాటకలో అధికారమెవరిదనేది తేలనుంది.