Mahesh Babu Changed : సూపర్ స్టార్ మహేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఆయనను చూసిన వాళ్లు అందరూ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో పోసాని చెప్పిన మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు అన్న డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ మేకోవర్ చూసిన ఫ్యాన్స్ ఇదే మాట అంటున్నారు. ఎందుకంటే దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా ఒప్పుకున్న తర్వాత మహేష్ తన ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మార్చుకుంటున్నారు. మరోవైపు మహేష్ బాబుతో సినిమా కమిటయ్యాక రాజమౌళి కూడా మారిపోతున్నారు.
గుంటూరు కారం సినిమాను చూసిన అభిమానులు కాస్త నిరాశ చెందారు. దీంతో వారిని పూర్తిగా మెప్పించేందుకు మహేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకే మహేష్ పూర్తిగా రాజమౌళి సినిమాతో బిజీ అయ్యారు. ఇంకా సినిమా పూజా కార్యక్రమాలు కూడా కాలేదు.. కానీ అప్పుడే దీనికోసం చాలా టైం ఇచ్చేశారు మహేష్. గుంటూరు కారం సినిమా చిన్న గ్యాప్ తీసుకుని వెకేషన్ వెళ్లి వచ్చారు మహేష్. రాజమౌళి సినిమాతో తన మార్కెట్ పెరుగుతుందని ముందుగానే డిసైడ్ అయిపోయారు ఆయన. రాజమౌళి సినిమా తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్కు రూట్ క్లియర్ అవుతుందనే విషయం హీరోలందరికీ తెలుసు. మహేష్ కూడా ఇదే చెప్పారు. ఇకపై రీజినల్ సినిమాలు చేస్తానో లేదో.. మళ్లీ మాస్ డ్యాన్స్ లు చేసే అవకాశం వస్తుందో రాదో అని గుంటూరు కారంలో ఫ్యాన్స్కు ట్రిబ్యూట్ ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు.
దీన్నిబట్టే మహేష్ భవిష్యత్ ప్లాన్స్ అర్థమవుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం కచ్చితంగా మూడేళ్లయితే రాసివ్వాల్సిందే. ఎంత వేగంగా సినిమాను పూర్తి చేసినా కూడా 2027లోనే ఇది రిలీజ్ అవుతుందని ఫిక్సైపోయారు కూడా. మరోవైపు మహేష్ సైతం ప్రిపేర్ అయిపోయారు. ఇదిలా ఉంటే SSMB 29 స్క్రిప్ట్లో దర్శకుడు జక్కన్న కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. SSMB29 ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలు పెట్టారు. ఇదొక అడ్వంచరస్ థ్రిల్లర్. 2024 సెకండాఫ్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.