![Minister Wife Warning](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/Minister-Ramprasad-Reddys-wife-insults-the-police.jpg)
Minister Wife Warning : సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు నుంచే పదే పదే… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆడంబరాలకు దూరంగా ఉండాలని చెబుతూ వస్తున్నారు. అయినా కొందరు మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసుల విషయంలో ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అయింది. ఆ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లగా.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎవరైనా సరే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో మాట్లాడిన విధానాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఆ వెంటనే మంత్రితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి వివరణ అడిగారు.. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగుల విషయంలో గౌరవంగా ఉండాలని సూచించారు. మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని అసలు సహించేది లేదన్నారు. ఆ ఘటనపై మంత్రి మరోసారి ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకు చెప్పారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు.
అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి విశాఖపట్నంలోని కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో.. ఆయన బదులు భార్య హరితారెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని భావించారు. హరితారెడ్డి చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ అవసరమైన భద్రతా ఏర్పాట్ల చూడాలని, తన వాహనానికి ఎస్కార్ట్గా రావాలని స్థానిక ఎస్సైకు సమాచారం అందించారు. కానీ ఎస్సై కాస్త ఆలస్యంగా రావడంతో.. మంత్రి సతీమణి ఏక వచనంతో పరుషంగా మాట్లాడారు. ఎస్సైతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియోలో మంత్రి సతీమణి, ఎస్సై మధ్య జరిగిన సంభాషణ ఇలా జరిగింది ‘తెల్లారిందా? మేం ఏ టైంకి చేరుకున్నామో తెలుసా?’ అంటూ హరితారెడ్డి అన్నారు. కాన్ఫరెన్స్ ఉందని, అందుకే ఆలస్యమైందని ఎస్సై వివరించగా.. ‘ఏం కాన్ఫరెన్స్… సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకుందా? పెళ్లికొచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని తెలీదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పొరపాటైందని, ఎస్సై సారీ చెబుతుంటే.. ‘దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా మీకు జీతమిస్తోంది? వైసీపీ వాళ్లు ఏమైనా ఇస్తున్నారా? డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నానా? మీ కోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం.. పదండి.. కాన్వాయ్ స్టార్ట్ చేయండి’ అంటూ మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మంత్రి సతీమణి తీరుపై విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే చంద్రబాబు సీరియస్గా స్పందించారు.