![MLA Kolikipudi](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/kolikipudi.jpg)
MLA Kolikipudi Srinivasarao : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్రమ కట్టడం పేరుతో ఓ భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పి పంపించారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీకి చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు ఓ భవనం నిర్మిస్తున్నారు.
స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని కంభంపాడుకు చెందిన ముస్లిం మహిళతో పాటు విస్సన్నపేటకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యే కొలికపూడికి ఫిర్యాదు చేశారు. ఆదివారం కంభంపాడు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని సందర్శించారు. అది అక్రమ నిర్మాణమని భావించిన ఆయన.. వాటిని తొలగించి బాధితులకు స్థలం అప్పగించాలని అధికారులను ఆదేశించారు. మీరు కనుక తొలగించకపోతే నేనే కూల్చివేస్తానంటూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. మంగళవారం ఉదయమే టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పొక్లెయిన్, డోజర్తో భవనం వద్దకు వెళ్లారు. వైసీపీ ఎంపీపీ వర్గం కూడా అక్కడికి చేరుకుంది. దీంతో భద్రాచలం నేషనల్ హైవేలో వాహనాల రాకపోకలు నిలిచాయి. ఆక్రమణ తొలగించే వరకు అక్కడి నుంచి కదలనని ఎమ్మెల్యే తన వాహనం పైకి ఎక్కి కూర్చున్నారు.
కూల్చివేత చర్యలను మైలవరం ఏసీపీ మురళీమోహన్ ఆపేందుకు ప్రయత్నించారు. భవనాన్ని కూల్చవద్దని సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని అధికారులు చెప్పినా వినకుండా ఎమ్మెల్యే మొండిగా వాదించారు. బాధితులకు వెంటనే న్యాయం జరగాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పొక్లెయిన్ సిబ్బంది భవనం స్లాబ్ కూల్చేశారు.
ఆక్రమణను నిర్ధారించి చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు ఆ స్థలంలోకి ఎవరూ రావద్దని అధికారులు తేల్చి చెప్పడంతో కూల్చివేతను తాత్కాలికంగా ఆపేశారు. ఆర్ఎస్ నంబరు 197/14లో నిర్మిస్తున్న ఆ భవనానికి అనుమతుల్లేవని, అది అక్రమ నిర్మాణమని పంచాయతీ కార్యదర్శి నోటీసు అంటించారు. తాము ఎవరి స్థలమూ ఆక్రమించలేదని, అక్రమంగా భవనం నిర్మించడం లేదంటూ ఎంపీపీ నాగలక్ష్మి స్పష్టం చేశారు. భవనం ఎలా కూల్చివేస్తారో చూస్తామంటూ అనుచరులతో కలిసి ఒకటో అంతస్తులో బైఠాయించారు. ఎమ్మెల్యే హడావుడి, అత్యుత్సాహం దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్తతలకు దారితీసింది.