- ఇప్పటికే మంతనాలు మొదలయ్యయా..
Operation Lotus on Karnataka State : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నది. ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నది. గత మూడు రోజులుగా పార్టీ హైకమాండ్ అన్ని వర్గాలతో చర్చిస్తూ సీఎం అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తు్న్నది. అయితే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ లో ఏదైనా తేడా జరిగితే మాత్రం బీజేపీ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అక్కడా ఆపరేషన్ లోటస్ కు తెరతీయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బీజేపీకి ఆ అవకాశం ఉందా..?
కర్ణాటక లో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలకు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. సిద్ధరామయ్య, డీకేల్లో ఎవరో ఒకరిని సీఎం చేస్తే మరొకరు చిన్నబోయే అవకాశం ఉంటుందని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది. సిద్ధరామయ్యనే సీఎం అభ్యర్థిగా ప్రధానంగా పేరు వినిపిస్తున్నా , డీకేను చల్లబర్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నది. డీకే శ్రమను వృథాగా పోనీయబోమని హామీనిస్తు్న్నది. ఈనేపథ్యంలో ఇద్దరిలో ఏ ఒక్కరు అసమ్మతి గళం ఎత్తినా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు బీజేపీ ఎదురు చూస్తున్నది. అపరేషన్ లోటస్ కు సిద్ధమైనా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే కాంగ్రెస్ నేతల తీరు బీజేపీ కి కలిసి వస్తుందా అనేది కొంత కష్టంగానే ఉంది. ఇప్పటికే డీకే కూడా కొంత వెనక్కి తగ్గినట్లుగా సమాచారం అందుతున్నది. హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత ఆయన కొంత చల్లబడినట్లుగా తెలుస్తున్నది. అయితే కర్ణాటక కాంగ్రెస్ లో డీకే, సిద్ధరామయ్యను కాదని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అపరేషన్ లోటస్ కు చిక్కే అవకాశం లేదని తెలుస్తున్నది. గతంలో ఇలా ఆపరేషన్ లోటస్ కు చిక్కిన తొమ్మిది మంది ఈసారి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడమే ఇందుకు నిదర్శనంగా చూస్తున్నారు. సో అపరేషన్ లోటస్ కర్ణాటకలో ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలను కాదని నిలబడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
2024 ఎన్నికల ముందు..
2024 లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ అచితూచి అడుగులు వేస్తున్నది. గన్ మిస్ ఫైర్ అయితే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ లోటస్ సరికాదని పార్టీ అగ్రనేతలు చెప్పినట్లుగా కూడా సమాచారం. కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరకుంటే అప్పుడు ఆలోచిద్దామని అప్పటివరకు వేచిచూత ధోరణితోనే ముందుకెళ్దామని వారు భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే పార్టీకి కర్ణాటకలో డ్యామేజ్ తీవ్రంగా ఉందని, ఇది సౌత్ మొత్తం వ్యాపిస్తే రానున్న లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయమని భావిస్తున్నట్లుగా రాజకీయ నిపుణులు చెబుతున్నారు.