మమతా బెనర్జీ-నితీష్ కుమార్-తేజస్వి యాదవ్ భేటీపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ను చంద్రబాబుతో పోల్చారు. చంద్రబాబు దుస్థితే నితీష్ కుమార్కు పడుతుందని జోస్యం చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు.
అప్పటి చంద్రబాబు పాత్రను ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోషించే ప్రయత్నం చేస్తోన్నారని అన్నారు. ఆ ప్రయత్నాలు వృధా అవుతాయని పేర్కొన్నారు. బీజేపీపై వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి గతంలో చంద్రబాబు కూడా దేశం మొత్తం తిరిగారని, అయినా ఎలాంటి ఫలితం రాలేదని చెప్పారు. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను చంద్రబాబు అప్పట్లో సమావేశం అయ్యారని అన్నారు.
సొంత రాష్ట్రంలో గెలవాలనే ఆలోచన లేకుండా చంద్రబాబు దేశం మొత్తం తిరిగి ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అప్పటివరకు ఏపీలో అధికారంలో ఉన్న ఆయన- 2019 ఎన్నికల తరువాత ఓడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నితీష్ కుమార్ కూడా బిహార్లో అధికారంలో ఉన్నారని, 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత చంద్రబాబులాగే ఆయనకు ఓటమి ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. ఏకతాటిపైకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే దేశ రాజధానిలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.
జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అయ్యారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిందీ సమావేశం. పలు అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి.