Ramcharan’s Tweet :
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మూడేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ బీజేపీ సోషల్ మీడియా టీం తాజాగా వైరల్ చేస్తుంది. తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ హిందూవాదులు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో రాంచరణ్ ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత’ అంటూ చేసిన వీడియోను కొందరు ఇప్పుడు రీ ట్వీట్ చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులు రాంచరణ్ వీడియో ఫర్ఫెక్ట్ గా సరిపోతుండటంతో హిందూవాదులు.. బీజేపీ సోషల్ మీడియా ఈ ట్వీట్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. కాగా ఈ ట్వీట్ రాంచరణ్ 2020 సెప్టెంబర్ 11న తన ట్విటర్లో పోస్టు చేశాడు. రాంచరణ్ తల్లి సురేఖ కొణిదెల ఇంట్లో తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫొటోను రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత’ అని నాడు పేర్కొన్నాడు.
కాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పలువురు బీజేపీ నేతలు ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు సైతం పడుతున్నారు. ఈ సంఘటనలపై ఉదయ్ నిధి స్టాలిన్ తాజాగా స్పందిస్తూ.. దేవుడు ఒక్కడే అనేది డీఎంకే విధానమని.. తాను కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే వ్యతిరేకించానని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తనపై ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తుందని వివరణ ఇచ్చారు.